LOADING...
Crude Oil : హర్మూజ్‌ మూసేస్తే.. 150 డాలర్ల దిశగా క్రూడ్‌ ఆయిల్ ?
హర్మూజ్‌ మూసేస్తే.. 150 డాలర్ల దిశగా క్రూడ్‌ ఆయిల్ ?

Crude Oil : హర్మూజ్‌ మూసేస్తే.. 150 డాలర్ల దిశగా క్రూడ్‌ ఆయిల్ ?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌-అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత 100 డాలర్లకు దిగువకు పడిపోయిన బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర మళ్లీ ఆ స్థాయిని దాటి పెరిగింది. హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేస్తే చమురు ధరలు 150 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెహ్రాన్‌కు అక్రమంగా రుసుములు చెల్లించే నౌకలకు హర్మూజ్‌ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఇవ్వవద్దని తమ నౌకాదళానికి ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు.

వివరాలు 

బ్యారెల్‌కు 103 డాలర్లకు చేరిన బ్రెంట్‌ క్రూడ్

మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి ఏదైనా సైనిక నౌక హర్మూజ్‌కు చేరుకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఇరాన్‌ విప్లవ గార్డులు స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర సుమారు 8 శాతం పెరిగి బ్యారెల్‌కు 103 డాలర్లకు చేరింది. అయితే, హర్మూజ్‌ దిగ్బంధనానికి సంబంధించిన భయాలు ఇంకా పూర్తిగా ధరల్లో కనిపించలేదని ఓనిక్స్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ నిర్వహణ అధికారి జార్జ్‌ మోంటెపెక్‌ తెలిపారు. ట్రంప్‌ హెచ్చరికలు అమల్లోకి వస్తే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 140 నుంచి 150 డాలర్ల మధ్యకు పెరగడం ఖాయమని ఆయన ఒక టెలివిజన్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

వివరాలు 

పూర్తి దిగ్బంధనం జరిగే అవకాశాలు తక్కువ

ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధి గుండా పలు దేశాలకు చెందిన నౌకలు సాధారణంగా ప్రయాణిస్తున్నాయి. అయితే, పూర్తిస్థాయి దిగ్బంధనం అమలులోకి వస్తే రోజుకు సుమారు 12 మిలియన్‌ బ్యారెళ్ల చమురు సరఫరా ప్రమాదంలో పడుతుందని మోంటెపెక్‌ హెచ్చరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తలెత్తే అవకాశముందని తెలిపారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఈ ప్రాంతానికి పరిమితమైన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మాత్రం పూర్తి దిగ్బంధనం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement