LOADING...
Ola: ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ. 366 కోట్ల పీఎల్ఐ నిధుల మంజూరు
ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ. 366 కోట్ల పీఎల్ఐ నిధుల మంజూరు

Ola: ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ. 366 కోట్ల పీఎల్ఐ నిధుల మంజూరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్రోత్సాహకం లభించడంతో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు శుక్రవారం మార్కెట్లో జోరు చూపాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద రూ. 366.78 కోట్ల నిధులు మంజూరవ్వడంతో, కంపెనీ తయారీ సామర్థ్యానికి దక్కిన గుర్తింపుగా ఇన్వెస్టర్లు భావిస్తూ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా స్టాక్ సుమారు 5 శాతం లాభపడింది. విద్యుత్ వాహనాల (EV) రంగంలో కీలకంగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోబిలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ఊతం మార్కెట్‌లో సానుకూల స్పందనను తెచ్చింది. ఆటో మొబైల్ రంగానికి వర్తించే పీఎల్ఐ పథకం కింద భారీ పరిశ్రమల శాఖ (Ministry of Heavy Industries) ఈ నిధులను మంజూరు చేసింది.

Details

ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యం

దేశీయంగా అధునాతన వాహనాల తయారీని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పథకం లక్ష్యంగా కేంద్రం పేర్కొంటోంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర దాదాపు 5.4 శాతం లాభపడి రూ. 37.28 స్థాయికి చేరింది. క్రిస్మస్ పండుగ కారణంగా బుధవారం మార్కెట్లు మూసివుండగా, అదే సమయంలో పీఎల్ఐ నిధులపై అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో తదుపరి ట్రేడింగ్ సెషన్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. శుక్రవారం నమోదైన ఈ పెరుగుదల ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, షేరు ఇంకా తన గత గరిష్ట స్థాయిలకు దూరంగానే ఉంది.

Details

ఐదు ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 10 శాతం రికవరీ

డిసెంబర్ 2024లో నమోదైన 52 వారాల గరిష్ట స్థాయి రూ. 99.90తో పోలిస్తే ప్రస్తుతం షేరు ధర దాదాపు 63 శాతం తక్కువగా ఉంది. ఇక ఇటీవల డిసెంబర్ 18న ఈ స్టాక్ రూ. 30.79 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. అయితే, గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 10 శాతం రికవరీ సాధించడం గమనార్హం. పీఎల్ఐ నిధుల మంజూరుపై ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి స్పందిస్తూ, "రూ. 366.78 కోట్ల ఈ ప్రోత్సాహకాలు మా తయారీ సామర్థ్యానికి, భారత్‌లోనే ప్రపంచ స్థాయి ఈవీ సాంకేతికతను అభివృద్ధి చేయాలన్న మా నిబద్ధతకు నిదర్శనం. లోకలైజేషన్, ఆవిష్కరణల విషయంలో మేం చేస్తున్న కృషికి ఇది దక్కిన గుర్తింపు అని తెలిపారు.

Advertisement