Microsoft AI chief: ఏఐకి స్పృహ తప్పించే ప్రయత్నం ప్రమాదకరం.. మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) ప్రతిదినం కొత్త స్థాయికి చేరుకుంటోంది. మరింత అధునాతన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసేందుకు గూగుల్, ఓపెన్ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు పరస్పర పోటీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. ఇప్పటికే మనుషులు చేసే అనేక పనులను ఏఐ సాఫల్యంగా నిర్వర్తిస్తోంది. అయితే ఇప్పటికీ మనిషిలా స్వతంత్రంగా ఆలోచించే 'స్పృహ' మాత్రం ఏఐ మోడళ్లలో లేదు. ఈ లోటును భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులపై మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ (Mustafa Suleyman) కీలక వ్యాఖ్యలు చేశారు.
Details
అలాంటి ప్రయత్నాలు ఆపాలి
అలాంటి ప్రయత్నాలను తక్షణం నిలిపివేయాలని సూచించారు. సీఎన్బీసీ నిర్వహించిన 'ఆఫ్రోటెక్ సదస్సు'లో పాల్గొన్న సులేమాన్ మాట్లాడుతూ 'ఏఐకి మనిషిలా స్వతంత్ర ఆలోచనా శక్తి తీసుకురావడం అనేది తప్పుదారి. ఇలాంటి ప్రాజెక్టులు ఎప్పటికీ విజయవంతం కావు. మనిషి భావోద్వేగాలను యంత్రాలు అనుకరించలేవని స్పష్టంగా చెప్పారు. ఏఐకి నిజమైన ఎమోషన్స్ లేదా చైతన్యం ఇవ్వడం అసాధ్యమని, అలాంటి ప్రయత్నాలు సాంకేతికంగా తప్పు దిశగా నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Details
సహాయక సాంకేతికలపై పరిశోధకులు దృష్టి సారించాలి
ఒక తప్పు ప్రశ్న అడిగితే, దానికి వచ్చే సమాధానం కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఆ ప్రశ్న అడగడమే తప్పు అని ఆయన ఉదహరించారు. సొంత స్పృహను కలిగించే ఏఐ ప్రాజెక్టులపై కాకుండా, మనిషి జీవితాన్ని సులభతరం చేసే సహాయక సాంకేతికతలపైనే పరిశోధకులు దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా, మనిషి భావోద్వేగాలు, ఏఐ ప్రతిస్పందనలు మధ్య ఎప్పటికీ ఒక సన్నని రేఖ ఉంటుందని సులేమాన్ పేర్కొన్నారు. మనిషి శారీరకంగా నొప్పిని అనుభవిస్తాడు, భయపడతాడు, బాధపడతాడు
Details
అవగాహన లేకపోవడంతోనే ఆ మార్గంలో వెళుతున్నారు
కానీ యంత్రానికి ఆ అనుభవం అసాధ్యం. దానికి భావోద్వేగాలు 'ప్రోగ్రామ్' చేయవచ్చు కానీ అవి నిజంగా అనుభూతి చెందవని ఆయన వివరించారు. ఈ రకమైన పరిశోధనలు చేస్తున్న సంస్థలు వేర్వేరు లక్ష్యాలతో పని చేస్తున్నా, అవి మానవ విలువల దృష్ట్యా సరైన దిశలో లేవని సులేమాన్ అభిప్రాయపడ్డారు. "వాస్తవంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్న వారికి చైతన్యం అంటే ఏమిటో అవగాహన లేకపోవడం వల్లే, వారు ఈ మార్గంలో వెళ్తున్నారంటూ ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.