UPI transactions: మే నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్ల జోరు.. రూ.29.90 లక్షల కోట్ల లావాదేవీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో డిజిటల్ చెల్లింపుల విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2025 మే నెలలో యూపీఐ ద్వారా రూ.29.90 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. అదే సమయంలో మొత్తం 2,320 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగి కొత్త రికార్డు సృష్టించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. అంతకుముందు 2025 ఏప్రిల్లో యూపీఐ ద్వారా రూ.29.03 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇక 2024 మే నెలలో ఈ విలువ రూ.25.14 లక్షల కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడాది వ్యవధిలో యూపీఐ లావాదేవీల విలువ 19 శాతం మేర పెరిగినట్లు ఎన్పీసీఐ తెలిపింది.
వివరాలు
ప్రధాన కారణాలు..
ఈ వృద్ధికి వేసవి సెలవుల కారణంగా పెరిగిన ప్రయాణాలు, ఐపీఎల్ సీజన్ ప్రభావం, సీజనల్ కొనుగోళ్లు ప్రధాన కారణాలుగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాష్ఫ్రీ పేమెంట్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాశ్ సిన్హా మాట్లాడుతూ.. ఈ గణాంకాలు దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం నిరంతరం పెరుగుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. నెలవారీగా యూపీఐ లావాదేవీల విస్తరణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
వివరాలు
తగ్గిన యూపీఐ సగటు లావాదేవీ మొత్తం
ఇదిలా ఉండగా, యూపీఐ సగటు లావాదేవీ మొత్తం (టికెట్ సైజ్) గత కొన్నేళ్లలో తగ్గినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. 2021లో ఒక్కో యూపీఐ లావాదేవీ సగటు విలువ రూ.1,848గా ఉండగా, 2025 నాటికి అది రూ.1,313కు తగ్గింది. అయితే దీనిపై ఆందోళన అవసరం లేదని ఆకాశ్ సిన్హా అభిప్రాయపడ్డారు. చిన్న మొత్తాల చెల్లింపులకూ యూపీఐ వినియోగం పెరుగుతుండటం వల్లే టికెట్ సైజ్ తగ్గిందని, ఇది యూపీఐ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందనే సంకేతమని ఆయన వివరించారు.