America's Debt: 40 ట్రిలియన్ డాలర్లు దాటిన అమెరికా అప్పు..
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. దేశ జాతీయ అప్పు బుధవారం నాటికి తొలిసారిగా 40 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 38.23 లక్షల కోట్లు) మార్కును దాటింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. అప్పుల భారం ఎందుకు పెరుగుతోంది? అమెరికా అప్పులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి పెరుగుతున్న వ్యయం, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం కేటాయిస్తున్న భారీ నిధులు కీలకంగా మారాయి. దీనికి తోడు లోటు బడ్జెట్పై చెల్లించాల్సిన వడ్డీలు కూడా ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. ఫలితంగా దేశ అప్పు వేగంగా పెరుగుతోంది.
వివరాలు
ఐదు నెలలకో ట్రిలియన్ డాలర్
అమెరికా అప్పు పెరుగుతున్న వేగం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2025 అక్టోబర్లో దేశ రుణం 38 ట్రిలియన్ డాలర్లను దాటింది.
ఆ తర్వాత కేవలం ఐదు నెలల్లో, 2026 మార్చిలో, అది 39 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
ఇప్పుడు మరో ఐదు నెలలు గడవకముందే 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.
అంటే దాదాపు ప్రతి ఐదు నెలలకు ఒక ట్రిలియన్ డాలర్ చొప్పున అప్పు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
వివరాలు
రక్షణ వ్యయాలు.. మరోవైపు ధరల నియంత్రణ ప్రయత్నాలు
ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం విభిన్న ఆర్థిక ప్రాధాన్యతలను సమన్వయం చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఒకవైపు గత ఆరు నెలలుగా ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో రక్షణ వ్యయాలను పెంచుతోంది.
మరోవైపు గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ పరస్పర విరుద్ధమైన ఆర్థిక ఒత్తిళ్లు కూడా ప్రభుత్వంపై భారం పెంచుతున్నాయి.
వివరాలు
అప్పు-జీడీపీ నిష్పత్తిని అదుపులోకి తెస్తాం
అయితే ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైట్హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు.
అనవసరమైన ఖర్చులను తగ్గించడంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.
తద్వారా అప్పు-జీడీపీ నిష్పత్తిని స్థిరమైన దిశలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
అమెరికన్లపై ఇప్పటికే ప్రభావం
పెరుగుతున్న ప్రభుత్వ అప్పుల ప్రభావం కేవలం ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకే పరిమితం కావడం లేదని నిపుణులు చెబుతున్నారు.
సాధారణ అమెరికన్ల జీవితాలపైనా దాని ప్రభావం కనిపిస్తోందని హెచ్చరిస్తున్నారు.
గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, వ్యాపార సంస్థలు పెట్టుబడులను తగ్గించడం, దాని ప్రభావంతో వేతనాలపై ఒత్తిడి పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
అదే సమయంలో వస్తువులు, సేవల ధరలు కూడా పెరుగుతున్నాయి.
వివరాలు
ఊహించని పరిణామాలు వస్తే సంక్షోభం ముదిరే అవకాశం
అమెరికా ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక విధానం దీర్ఘకాలంలో నిలకడగా ఉండేలా లేదని బైపార్టిసన్ పాలసీ సెంటర్ అధ్యక్షురాలు మార్గరెట్ స్పెల్లింగ్స్ హెచ్చరించారు.
కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా భారీ స్థాయిలో అంతరాయాలు ఏర్పడటం,ఆర్థిక మాంద్యం రావడం లేదా ప్రపంచ యుద్ధం వంటి ఊహించని ఘటనల్లో ఏదైనా చోటుచేసుకుంటే, ప్రస్తుతం ఉన్న అప్పుల సమస్య మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు.
41.1 ట్రిలియన్ డాలర్ల రుణ పరిమితి
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన రుణ పరిమితి 41.1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రస్తుత వేగంతో అప్పులు పెరుగుతూ ఉంటే 2027 నాటికి ఈ పరిమితిని చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా పరిస్థితిపై ఆందోళన
అప్పుడు రుణ పరిమితిని పెంచాలా లేదా ఇతర నిర్ణయం తీసుకోవాలా అనే అంశంపై అమెరికా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి అత్యంత బలహీనంగా ఉందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ఇటీవల చేసిన విశ్లేషణలో పేర్కొంది.
ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన అప్పు, వేగంగా పెరుగుతున్న రుణభారం, అధిక వ్యయాలు, వడ్డీ చెల్లింపులు కలిసి అమెరికా ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులో మరింత పెద్ద సవాళ్లు విసిరే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.