US Tariffs: సెక్షన్ 301 దర్యాప్తు తర్వాత పాత టారిఫ్లే.. అమెరికా కీలక సంకేతాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సుంకాల (US Tariffs) విషయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) చేపట్టిన సెక్షన్ 301 దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రపంచ దేశాలపై మునుపటి స్థాయిలో టారిఫ్లను తిరిగి అమలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే సెక్షన్ 122 కింద విధించిన 10 శాతం టారిఫ్లు జులై 24 వరకు ప్రపంచవ్యాప్తంగా కొనసాగనున్నాయని వెల్లడించారు. అదే సమయంలో వెట్టిచాకిరీ నిర్మూలనలో తగిన చర్యలు తీసుకోలేదన్న కారణంతో భారత్తో పాటు 50కి పైగా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 12.5 శాతం సుంకం విధించాలని అమెరికా వాణిజ్య కార్యాలయం తన మధ్యంతర నివేదికలో ప్రతిపాదించింది.
వివరాలు
అప్పుడే వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళతాం: పీయూష్ గోయెల్
వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై పరస్పర సుంకాలు ఉపయోగించారని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. అదే లక్ష్యంతోనే ఇప్పుడు సెక్షన్ 301 ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు లండన్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ.. భారత్కు ప్రయోజనకరమైన షరతులు ఉన్నప్పుడే వాణిజ్య ఒప్పందం దిశగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
వివరాలు
ఏమిటీ సెక్షన్ 301
ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు ఉన్న కీలక చట్టపరమైన అధికారాల్లో సెక్షన్301 ఒకటి. అమెరికా వాణిజ్య భాగస్వాములు అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు తమ వ్యాపారాలు,ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా లేదా అన్న విషయంపై ఈ చట్టం కింద దర్యాప్తు చేపట్టే అధికారం అమెరికాకు ఉంది. దర్యాప్తు ప్రారంభమైన తర్వాత సంబంధిత దేశాల వాణిజ్యవిధానాలపై అమెరికా ఆధారాలను సేకరిస్తుంది. ఒకదేశం అన్యాయమైన వాణిజ్య విధానాలను అనుసరిస్తోందని తేలితే,ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) అనుమతి అవసరం లేకుండానే ఆ దేశంపై అమెరికా ఏకపక్షంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈచట్టం ద్వారా భారీ సుంకాలు విధించడం లేదా ప్రతీకార వాణిజ్య చర్యలు చేపట్టేందుకు అమెరికాకు చట్టబద్ధమైన అధికారం లభిస్తుంది.