
Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (AI) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, గూగుల్ భవిష్యత్లో దీని పాత్ర కీలకమని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు.
శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన బ్లూమ్బర్గ్ టెక్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన, గూగుల్ ఉద్యోగ నియామకాలు, భవిష్యత్తులో AI పాత్ర వంటి అంశాలపై మాట్లాడారు. ''నా తర్వాత ఎవరు గూగుల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టినా, వారికి AI ఒక అసాధారణ సహాయకుడిగా ఉంటుందని పిచాయ్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు, కృత్రిమ మేధ ఉద్యోగాలను భవిష్యత్తులో నశింపజేస్తుందన్న భయాల నడుమ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే, AIను ఒక ఉత్పాదకతను పెంచే సాధనంగా చూడాలని, అది మానవులను భయపెట్టే అవసరం లేదని స్పష్టం చేశారు.
Details
ఇంజనీర్ల నియామక ప్రక్రియ కొనసాగుతుంది
AI రంగంలో పెట్టుబడులు పెంచుతున్నప్పటికీ మానవ ప్రతిభకే ప్రాధాన్యతనిస్తామని పిచాయ్ తెలిపారు. 2026లో కూడా ఇంజనీర్ల నియామక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కృత్రిమ మేధ వల్ల ఇంజనీర్ల ఉత్పాదకత భారీగా పెరుగుతుందని, వారు సాధారణ పనుల నుండి విముక్తి పొందుతారని అన్నారు. అయితే మైక్రోసాఫ్ట్ సహా ఇతర టెక్ దిగ్గజాలు ఈ ఏడాది పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
తమ కార్యకలాపాల్లో AI వినియోగాన్ని పెంచే క్రమంలో ఈ లేఆఫ్ చర్యలు తీసుకున్నాయని పేర్కొన్నాయి.
గూగుల్ కూడా గత కొన్ని సంవత్సరాల్లో ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన నేపథ్యంలో, సుందర్ పిచాయ్ తాజా వ్యాఖ్యలు రంగ పరిశీలకుల్లో ఆసక్తికరంగా మారాయి