IPO: యశోద హెల్త్కేర్ ఐపీఓకు సెబీ గ్రీన్సిగ్నల్.. మరికొన్ని ఇతర సంస్థలకు కూడా..
ఈ వార్తాకథనం ఏంటి
యశోద హాస్పిటల్స్ను నిర్వహిస్తున్న యశోద హెల్త్కేర్ సర్వీసెస్కు తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) నిర్వహించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది. ఈ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్లో ఐపీఓ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రతిపాదిత ఐపీఓలో కొత్తగా ఈక్విటీ షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఉండనుందని సమాచారం. మొత్తం ఐపీఓ పరిమాణం రూ.3,000 నుంచి రూ.4,000 కోట్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను కొత్త నగరాల్లో ఆస్పత్రుల ఏర్పాటు, పడకల సామర్థ్య విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,కొత్త వైద్య యంత్ర పరికరాల కొనుగోలుకు యశోద హెల్త్కేర్ వినియోగించనుందని తెలిసింది.
వివరాలు
మరో ఆరు కంపెనీల ఐపీఓలకు కూడా సెబీ గ్రీన్ సిగ్నల్
ఇదే సమయంలో మరో ఆరు కంపెనీల ఐపీఓలకు కూడా సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఎస్బీ రిటెయిల్ ఇండియా, ఫ్యూజన్ సీఎక్స్, ఓరియంట్ కేబుల్స్, టర్టల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్,ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్,లోహియా కార్ప్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఆరు సంస్థలు కలిపి రూ.6,000 కోట్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని అంచనా. ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్, డి-రాయల్,కాంచీపురం నారాయణి సిల్క్స్, వాల్యూ జోన్ హైపర్ మార్ట్ వంటి రిటైల్ బ్రాండ్లను నిర్వహిస్తున్న ఆర్ఎస్బీ రిటెయిల్ ఇండియా లిమిటెడ్ రూ.500 కోట్ల ఐపీఓను తీసుకురానుంది.
వివరాలు
ఫ్యూజన్ సీఎక్స్ రూ.1,000 కోట్ల విలువైన ఐపీఓకు సిద్ధం
దీనికి తాజాగా సెబీ ఆమోదం లభించింది. ఐపీఓ ద్వారా వచ్చే నిధుల్లో రూ.275 కోట్లను అప్పుల తీర్చడానికి వినియోగించనుండగా, ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ల కింద కొత్త స్టోర్ల ప్రారంభానికి రూ.118 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ఫ్యూజన్ సీఎక్స్ రూ.1,000 కోట్ల విలువైన ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో రూ.600 కోట్ల మేరకు కొత్త షేర్ల జారీ ఉండగా, మిగతా రూ.400 కోట్లు ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటాయి.
వివరాలు
ఓఎఫ్ఎస్ ద్వారా రూ.380 కోట్ల విలువైన షేర్ల విక్రయం
ఓరియంట్ కేబుల్స్ ఐపీఓలో రూ.320 కోట్లకు కొత్త ఈక్విటీ షేర్లు జారీ చేయనుండగా, ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా రూ.380 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్ ఐపీఓలో రూ.150 కోట్లకు కొత్త షేర్ల జారీతో పాటు ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్లు 1.23 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచనున్నారు. లోహియా కార్ప్ విషయంలో మాత్రం మొత్తం ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలోనే ఉండటం విశేషంగా నిలుస్తోంది.