Zepto IPO: రూ.10,000 కోట్ల ఐపీఓతో మార్కెట్లోకి జెప్టో.. ఈ నెలాఖరులో లేదా జులైలో లాంచ్ అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్విక్ కామర్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థ 'జెప్టో' త్వరలో తన ఐపీఓ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, సంస్థ సవరించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ను ఈ వారంలోనే సెబీకి సమర్పించే అవకాశం ఉంది. ఆదిత్ పలీచా నేతృత్వంలోని జెప్టో, ముసాయిదా పత్రాల సమర్పణ అనంతరం దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో రోడ్షోలను నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరులో లేదా జులై నెలలో కంపెనీ ఐపీఓ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.10,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
సూమారు రూ.9,500 కోట్లు దాటినట్లు సమాచారం
ప్రస్తుతం జెప్టో త్రైమాసిక నికర ఆర్డర్ విలువ (Net Order Value - NOV) 1 బిలియన్ డాలర్లను, అంటే సుమారు రూ.9,500 కోట్లను దాటినట్లు సమాచారం. 2021లో ఆదిత్ పలీచా, కైవల్య వోహ్రా కలిసి జెప్టోను స్థాపించారు. ప్రారంభమైన కొద్ది కాలంలోనే దేశంలోని అతిపెద్ద క్విక్ కామర్స్ సంస్థల్లో ఒకటిగా అవతరించిన జెప్టో, ఈ రంగంలో అత్యంత వేగంగా విస్తరించిన కంపెనీగా గుర్తింపు పొందింది. ఇప్పటికే గతేడాది డిసెంబరులో కాన్ఫిడెన్షియల్ మార్గంలో ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించిన సంస్థ, తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ కోరిన అదనపు వివరాలు, అంశాలను జోడించి సవరించిన పత్రాలను మళ్లీ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.