
Mohan Babu: మంచు మోహన్బాబు యూనివర్సిటీకి గట్టి దెబ్బ.. ఆ నగదు మొత్తం చెల్లించాలని ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతిలోని మోహన్బాబు యూనివర్శిటీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తీవ్ర చర్యలు తీసుకుంది. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు విధించినందుకు యూనివర్శిటీ యాజమాన్యానికి భారీ జరిమానా విధించింది. 2022-23 విద్యాసంవత్సరం నుండి గతేడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి సుమారు రూ.26 కోట్ల అదనపు ఫీజులు వసూలు చేసినట్లు కమిషన్ విచారణలో తేలింది. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్లోనూ అక్రమాలు జరిగాయని నివేదికలో స్పష్టం చేసింది. ఉన్నత విద్య కమిషన్ యూనివర్శిటీపై రూ.15 లక్షల జరిమానా విధిస్తూ, విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.26 కోట్ల మొత్తాన్ని 15 రోజుల్లో తిరిగి చెల్లించాలనే ఆదేశాలు జారీ చేసింది.
Details
గుర్తింపును రద్దు చేయాలి
ఈ వ్యవహారం గత ఏడాదే వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పేరెంట్స్ అసోసియేషన్ పెద్ద ఎత్తున ఉన్నత విద్యామండలి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేసింది. ఫిర్యాదుల ఆధారంగా సుదీర్ఘంగా విచారణ జరిపిన ఉన్నత విద్యా మండలి, యూనివర్శిటీపై వచ్చిన అన్ని ఆరోపణలు నిజమని నిర్ధారించింది. దీంతో కమిషన్ తదుపరి చర్యగా ఆ విశ్వవిద్యాలయానికి ఉన్న అనుమతి, గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి, అలాగే యూజీసీ (UGC), ఏఐసీటీఈ (AICTE), పీసీఐ (PCI), ఐసీఆర్ (ICAR), ఎన్సీఏహెచ్పీ (NCAHP), హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ వంటి నియంత్రణ సంస్థలకు సిఫార్సు చేసింది. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు 2022లో మోహన్బాబు ప్రైవేట్ యూనివర్శిటీగా రూపాంతరం చెందాయి.
Details
ఎక్కువ ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ
అప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో 70% సీట్లు ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేయగా, ప్రైవేట్ యూనివర్శిటీగా మారిన తర్వాత గ్రీన్ఫీల్డ్ కింద ప్రారంభించిన కోర్సుల్లో 35% సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయాలని నిబంధన ఉంది. ఈ కోర్సుల ఫీజులను నిర్ణయించేది ఉన్నత విద్య నియంత్రణ కమిషనే. అయితే యాజమాన్యం ఆమోదించినదానికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తోందని తల్లిదండ్రుల అసోసియేషన్ తీవ్ర ఆక్షేపణలు తెలిపింది. అనంతరం ఈ ఫిర్యాదులు విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్య కమిషన్, ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి చేరగా విచారణ అనంతరం ఆరోపణలు సత్యమని తేలడంతో చర్యలు తీసుకున్నట్లు అధికార నివేదికల్లో పేర్కొంది.