Peddi : 'పెద్ది' ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. ఇక నుంచి 6 నిమిషాల కొత్త సీన్స్ యాడ్!
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కిన వైవిధ్యభరిత చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2026లో దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు, ఇంకా చూడబోయే అభిమానులకు చిత్ర యూనిట్ ఓ భారీ సర్ప్రైజ్ను సిద్ధం చేసింది. సాధారణంగా సినిమా విడుదలైన తర్వాత నిడివి ఎక్కువగా ఉందనే కారణంతో కొన్ని సన్నివేశాలను తొలగించడం జరుగుతుంటుంది. కానీ 'పెద్ది' విషయంలో మాత్రం మేకర్స్ పూర్తి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
అధికారిక పోస్టర్ రిలీజ్
థియేటర్లలో చిత్రానికి లభిస్తున్న అద్భుతమైన స్పందనను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు ఏకంగా 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల కొత్త సన్నివేశాలను నేటి నుంచి సినిమాకు జోడించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. అదనంగా జోడించబోయే ఈ సన్నివేశాలకు అవసరమైన సెన్సార్ అనుమతులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో రేపటి నుంచి థియేటర్లలో కొత్త ఎడిటింగ్ వెర్షన్తో 'పెద్ది' ప్రదర్శితమవనుంది. సంగీత దిగ్గజం ఏఆర్. రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్.రత్నవేలు రూపొందించిన విజువల్స్తో ఈ కొత్త సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
వివరాలు
జాన్వీ కపూర్ పాత సీన్ల తొలగింపు
ఇక ఈ అప్డేట్లో అసలు ట్విస్ట్ ఏమిటంటే, సినిమాలో హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్కు సంబంధించిన కొన్ని పాత సన్నివేశాలను ఎడిటింగ్లో తొలగించినట్లు సమాచారం. గతంలో ఉన్న కొన్ని సన్నివేశాల స్థానంలో మరింత భావోద్వేగభరితంగా, ఆసక్తికరంగా ఉండే కొత్త డ్రామాను జోడించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథను మరింత వేగంగా, ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడానికే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న 'పెద్ది'కి ఇప్పుడు దాదాపు ఆరు నిమిషాల కొత్త సన్నివేశాలు జతకావడంతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.