Trisha: ప్రముఖ నటి త్రిష ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖులపై వస్తున్న బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి తాజాగా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలోని ఆళ్వార్పేట్లో ఉన్న త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి డీజీపీ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాడు. ఈ సమాచారం అందిన వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు త్రిష ఇంటికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇంటి పరిసరాలు, గదులు, పార్కింగ్ ప్రాంతాలు సహా ప్రతి మూలను గంటల పాటు పరిశీలించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇది ఆకతాయిల పనేనని పోలీసులు తేల్చారు.
Details
గతంలో కూడా బాంబు బెదిరింపులు
వచ్చిన బెదిరింపు ఫేక్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా త్రిష నివాసానికి మూడుసార్లు ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం జరిగింది. తాజా ఘటనతో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ ఘటనపై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో చెన్నైలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు ఇలాంటి బూటకపు బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ ఫేక్ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ విచారణ ప్రారంభించినట్లు సమాచారం.