Arijith Singh : ఇక వెండితెరపై అర్జిత్ గొంతు వినిపించదా?.. ప్లే బ్యాక్ సింగింగ్కు గుడ్బై
ఈ వార్తాకథనం ఏంటి
అర్జిత్ సింగ్ అనే పేరు వినగానే ఒక ప్రత్యేకమైన మాధుర్యం వెంటనే గుర్తుకొస్తుంది. ఆయన గొంతు నుంచి ఒక పాట విడుదలైందంటే... అది హిట్ అవ్వాల్సిందే అన్న నమ్మకం అభిమానుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో అర్జిత్ పాటలు లేని ప్లేలిస్ట్ దాదాపు కనిపించదు. అలాంటి క్రేజ్ ఉన్న స్టార్ సింగర్ ఇప్పుడు తన అభిమానులకు షాకిచ్చే నిర్ణయం ప్రకటించారు. ఇకపై తాను ప్లే-బ్యాక్ సింగింగ్కు గుడ్బై చెప్పబోతున్నానని, తన వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని వెల్లడించారు.
వివరాలు
హిందీతో పాటు తెలుగులో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్
2005లో 'ఫేమ్ గురుకుల్' రియాలిటీ షోతో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన అర్జిత్... క్రమంగా ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన సింగర్గా ఎదిగారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు, తమిళ్ తదితర భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. అలాంటి అర్జిత్ తాజాగా మాట్లాడుతూ... "ఇకపై నేను ప్లే-బ్యాక్ సింగర్గా కొత్తగా పాటలు పాడను. ప్రస్తుతం నేను కమిట్ అయిన సినిమాలకు మాత్రమే నా వాయిస్ ఇస్తాను. అవి పూర్తయ్యాక నా రిటైర్మెంట్ మొదలవుతుంది" అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్తో పాటు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కూడా తెలియజేశారు.
వివరాలు
కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే అర్జిత్ కీలక నిర్ణయం
ఈఏడాది విడుదల కాబోయే తన పెండింగ్ పాటల వివరాలను అభిమానులతో పంచుకున్నారు. దీంతో అర్జిత్ సింగ్ గొంతు వెండితెరపై వినిపించేది ఈ ఏడాదే చివరిసారి కావచ్చన్న భావన వ్యక్తమవుతోంది. కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే అర్జిత్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు బాలీవుడ్లోనూ,అభిమానుల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది. అసలు ఇంత సడెన్గా ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వ్యక్తిగత కారణాలేనా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇన్నాళ్లూ తన మెలోడీ పాటలతో కోట్ల మందికి ఊరటనిచ్చిన అర్జిత్ గొంతు ఇక వినిపించదన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ విషయంలో అర్జిత్ పూర్తి స్థాయిలో స్పందిస్తారో లేదో చూడాలి.