
Chiranjeevi: నేను మాట్లాడాల్సిన అవసరం లేదు.. నా మంచితనమే మాట్లాడుతుంది : చిరంజీవి
ఈ వార్తాకథనం ఏంటి
ట్రోలింగ్కు సంబంధించి తాను నేరుగా స్పందించకపోయినా, తాను చేసిన మంచిపనులే తనను ప్రతినిధిగా నిలబెడతాయని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. ఫీనిక్స్ ఫౌండేషన్తో కలిసి నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం గొప్పతనాన్ని వివరించారు. ఒక జర్నలిస్ట్ రాసిన కథనం ద్వారా తాను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చానని, ఆ జర్నలిస్ట్ను తాను ఇప్పటివరకు కలవలేకపోయినా, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.
వివరాలు
'రక్తదానం' అన్న పదం వినగానే జనాలకు నేను గుర్తొస్తుంటే..
''ఇలాంటి అద్భుత కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.రక్తదానం చేసిన వారందరికీ కృతజ్ఞతలు.నా కుమారుడిలాంటి తేజ సజ్జాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.'రక్తదానం' అన్న పదం వినగానే జనాలకు నేను గుర్తొస్తుంటే, అది నా పూర్వజన్మలో చేసిన పుణ్యఫలమే అనుకుంటా. ఈ సందర్భంలో మీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. కొంతకాలంగా నేను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నాను. అయితే ఇటీవల ఓ రాజకీయ నాయకుడు నన్ను కారణం లేకుండా విమర్శించారు. ఆ తరువాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్లినప్పుడు, అక్కడ ఓ మహిళ అతనికి ఎదురుతిరిగి ప్రశ్నించింది.
వివరాలు
చిరంజీవి బ్లడ్బ్యాంక్ ద్వారా తన బిడ్డ ప్రాణాలు నిలిచాయని..
'చిరంజీవిని ఎందుకు విమర్శించారు?' అంటూ ఆమె భావోద్వేగంతో స్పందించింది. ఆ వీడియో చూసిన తరువాత ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా తన బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే తనకు ఆయనపై ఎంతో గౌరవమని ఆమె తెలిపింది. ఆ మాటలు వినగానే నా మనసు ఆనందంతో తేలిపోయింది.'' ''సోషల్ మీడియాలో నాపై వచ్చే విమర్శలపై స్పందించమని చాలామంది అడుగుతుంటారు. కానీ నేను ఎప్పుడూ స్పందించను. ఎందుకంటే నన్ను కాపాడేది నా మంచితనమే. అభిమానుల ప్రేమ, నా సేవా కార్యక్రమాలే నాకు రక్షణ కవచాలుగా నిలుస్తాయి.
వివరాలు
ఆ క్షణంలో కోపంలో నన్ను తిట్టినా..
నేను మాట్లాడకపోయినా, నా పద్ధతులు, నా చర్యలే నా తరఫున మాట్లాడతాయి. ఇది నాకు నమ్మకంగా అనిపించే నిజం. ఆ మహిళ వ్యాఖ్యల తరువాత ఆ నాయకుడు నన్నుఎక్కడా విమర్శించలేదు. వాళ్లకు కూడా మనసు ఉంటుంది కదా.. ఆ క్షణంలో కోపంలో నన్ను తిట్టినా.. ఇంటికి వెళ్లాక వాళ్ల భార్య అయినా మరోసారి ఇలా మాట్లాడొద్దు అని చెబుతుంది'' అని చెప్పారు.