LOADING...
Devula Palli Krishna Shastry: భావకవిత్వ బ్రహ్మ దేవులపల్లి కృష్ణశాస్త్రి.. ఆంధ్రా షెల్లీగా వెలుగొందిన మహాకవి
ఆంధ్రా షెల్లీగా వెలుగొందిన మహాకవి

Devula Palli Krishna Shastry: భావకవిత్వ బ్రహ్మ దేవులపల్లి కృష్ణశాస్త్రి.. ఆంధ్రా షెల్లీగా వెలుగొందిన మహాకవి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భావకవిత్వానికి ఆద్యుడు,ఆంధ్రా షెల్లీగా ప్రసిద్ధి చెందిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్య లోకానికి అపూర్వ కాంతి ప్రసరించిన మహానుభావుడు. సాహిత్య సరస్వతికి ఆప్తసుతుడిగా,కవితా రూపంలో భావాల్ని మలిచిన ప్రతిభావంతుడిగా ఆయన పేరు చిరస్మరణీయం. తెలుగు సినీ రంగంలో ఆయన రచించిన పాటలు విశేష ఖ్యాతిని సంపాదించాయి. 1897 నవంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపాలెంలో తమ్మన్నశాస్త్రి,సీతమ్మ దంపతులకు జన్మించిన ఆయనపై అనేక సామాజిక,సాంస్కృతిక ఉద్యమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. భాష, సంస్కృతి, సమాజ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న కాలంలో ఆయన రచనా ప్రస్థానం ప్రారంభమైంది. ఆ యుగంలో ప్రాధాన్యం పొందిన కవితా ధోరణి భావకవిత్వం కాగా,ఆ ఉద్యమానికి ప్రతినిధిగా నిలిచిన శ్రేష్ఠ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారే.

వివరాలు 

"జయ జయ ప్రియాంధ్ర జనయితీ" గీతం

ప్రేమ, ప్రకృతి, దేశాభిమానం, ఆధ్యాత్మికత, సామాజిక సంస్కరణ, మానవతా దృక్పథం, కాల్పనికత, మార్మికత వంటి అంశాలన్నీ ఆయన కవిత్వంలో సమగ్రంగా ప్రతిఫలించాయి. దేవులపల్లి రచించిన దేశభక్తి గీతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది "జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి." భారతమాతను ఆరాధిస్తూ రచించిన ఈ గేయం జాతీయ పర్వదినాల్లో ప్రతి తెలుగువాడి నోట వినిపిస్తుంది. ఇదే దేశభక్తి భావంతో ఆంధ్రభూమిని తల్లిగా భావించి రచించిన "జయ జయ ప్రియాంధ్ర జనయితీ" అనే మరో గీతం కూడా ఉంది, అయితే అది అంతగా ప్రచారంలోకి రాలేదు. ఇందులో ఆంధ్రదేశాన్ని భారతమాతకు ప్రియసుతగా భావించి చిత్రించారు. గేయాంతంలో ప్రపంచమంతా ఒక కుటుంబమనే విశాల భావనను వ్యక్తం చేశారు.

వివరాలు 

కులమత భేదాలు, వివక్షలు లేని సమాన సమాజం ఏర్పడాలని..

కులమత భేదాలు, వివక్షలు లేని సమాన సమాజం ఏర్పడాలని, విశాల మానవతా దృక్పథంతో అందరూ ఒకటిగా జీవించాలనే ఆశయాన్ని ప్రతిపాదించారు. లోకక్షేమం, భావితరాల సౌభ్రాతృత్వం, స్వాతంత్ర్య రక్షణ కోసం దృఢసంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా లక్ష్యసాధనకు అంకితమవ్వాలని, తమ ప్రయాణం ఎప్పటికీ దారి తప్పదని ధృడనిశ్చయాన్ని వ్యక్తం చేశారు. అలాంటి ఉన్నత ఆశయాలతో ముందుకు సాగే తమకు తల్లి దీవెనలు ప్రసాదించాలని, శుభశాంతులు కలగాలని ప్రార్థించారు.

Advertisement

వివరాలు 

హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రేరణ

దేవులపల్లి కృష్ణశాస్త్రి కేవలం రచనల ద్వారానే దేశభక్తిని ప్రదర్శించలేదు; తన కార్యాచరణ ద్వారానూ అదే నిబద్ధతను చాటిచెప్పారు. బ్రహ్మసమాజం, నవ్యసాహితీ సమితి వంటి వేదికల్లో సభ్యునిగా భావకవిత్వోద్యమ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. సమాజంపై ఆయనకున్న అపారమైన మమకారం హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రేరణ ఇచ్చింది. కుటుంబ సభ్యుల నిరసనను లెక్కచేయకుండా వేశ్యవివాహ సంస్థను స్థాపించి అనేక కళావంతుల వివాహాలు జరిపించారు. దేవుడు గుడిలో మాత్రమే కాదు, ప్రజల మధ్య, ముఖ్యంగా బాధితుల హృదయాల్లో ఉంటాడనే భావాన్ని "ఈ సుధర్మభవనములో ఈరేడు జగాలనేలు ఈశ్వరుడే దినజన హృదీశ్వరుడే కొలువుదీర్చు" అనే గీతంతో ప్రజలకు తెలియజేశారు.

Advertisement

వివరాలు 

గొంతు క్యాన్సర్ కారణంగా స్వరాన్ని కోల్పోయినా..

1957లో ఆయన ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా గేయాలు,నాటికలు,ప్రసంగాలు అందించారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు, 1976లో పద్మభూషణ్ పురస్కారం, 1978లో సాహిత్య అకాడమీ అవార్డు ఆయన ప్రతిభకు లభించిన గౌరవాలు. 1964లో గొంతు క్యాన్సర్ కారణంగా స్వరపేటిక తొలగించాల్సి వచ్చినప్పటికీ,ఆ దుస్థితిలోనూ ఆయన రచనా యజ్ఞం ఆపలేదు. స్వరాన్ని కోల్పోయినా, తన కలం శక్తితో సినిమాల కోసం పాటలు, ఆకాశవాణి కోసం లలిత గీతాలు రాశారు. 1980 ఫిబ్రవరి 24న ఆయన పరమపదించారు. అయితే ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన గేయాలు ఇప్పటికీ మన హృదయాల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. "వసుధైక కుటుంబం" అనే ఆయన మహత్తర స్వప్నాన్ని సాకారం చేయడం ద్వారానే ఆ మహాకవికి యథార్థ నివాళి అర్పించినవారమవుతాము.

Advertisement