Director Sukumar: రంగస్థలంలో సమంతను హీరోయిన్గా వద్దనుకున్నా.. సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో రంగస్థలం ఒకటి. ఈ సినిమాలో చరణ్ నటన ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా చరణ్ నటుడిగా మరో స్థాయికి చేరుకున్నారు. 1980ల కాలాన్ని నేపథ్యంగా తీసుకుని గ్రామీణ వాతావరణంలో ఈ కథను సుకుమార్ ఆవిష్కరించారు. ఈ చిత్రంలో చరణ్ 'చిట్టిబాబు' అనే వినికిడి సమస్య ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన అన్నగా 'కుమార్ బాబు' పాత్రలో ఆది పినిశెట్టి మెప్పించగా, ఊరి పెద్దలైన 'ఫణీంద్ర భూపతి' పాత్రలోజగపతి బాబు తనదైన నటనతో ఆకట్టుకున్నారు.
వివరాలు
ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుకుమార్
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సమంత రుతు ప్రభు 'రమాలక్ష్మి' పాత్రలో కనిపించి, చిట్టిబాబుకు ప్రేమికురాలిగా నటించింది. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అయింది. అయితే, గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రానికి సమంతను హీరోయిన్గా ఎంపిక చేయడం మొదట తనకు అంతగా ఇష్టం లేకపోయిందని చెప్పారు. కొత్త ముఖాన్ని లేదా సాధారణ అమ్మాయిని తీసుకోవాలని ఆలోచించినట్టు వెల్లడించారు. చరణ్, సమంత ఇద్దరూ పెద్ద స్టార్లు కావడంతో వారిని సమతుల్యం చేయడం కష్టమవుతుందేమో అనిపించిందని అన్నారు.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుకుమార్ మాటలు
కానీ, సమంత ప్రతి సన్నివేశంలో చూపించిన నటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని సుకుమార్ తెలిపారు. ఆమె నటన చూసినప్పుడల్లా తన నిర్ణయం తప్పు అనిపించిందని, ఆమె నటనకు ఇంప్రెస్ అయ్యా.. భవిష్యత్తులో కూడా ఆమెతో కలిసి పనిచేయాలని అనిపించిందని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.