LOADING...
Gurthukosthunnayi Review: పెళ్లి వేళ జ్ఞాపకాలు చెదిరితే.. నవ్వులు, భావోద్వేగాల మేళవింపు 'గుర్తుకొస్తున్నాయి' : రివ్యూ
పెళ్లి వేళ జ్ఞాపకాలు చెదిరితే.. నవ్వులు, భావోద్వేగాల మేళవింపు 'గుర్తుకొస్తున్నాయి' : రివ్యూ

Gurthukosthunnayi Review: పెళ్లి వేళ జ్ఞాపకాలు చెదిరితే.. నవ్వులు, భావోద్వేగాల మేళవింపు 'గుర్తుకొస్తున్నాయి' : రివ్యూ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెబ్‌సిరీస్‌: గుర్తుకొస్తున్నాయి నటీనటులు: విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, ప్రియదర్శిని రామ్, శివన్నారాయణ, వివా రాఘవ, పవన్ సిద్ధు, గోదావరి గోపి, అనీష్ కురువిల్ల, మేఘనా సునీల్, మధు, రామ్‌చరణ్, చక్రి, సిమన్ తదితరులు. సంగీతం: సుహాస్ ఛాయాగ్రహణం: రేహాన్ షేక్ ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి, వెంకటేష్ చుండూరు నిర్మాత: శరత్ చంద్ర నాయుడు దర్శకత్వం: వినోద్ గాలి స్ట్రీమింగ్: ఈటీవీ విన్

వివరాలు

కథ ఏంటంటే..

రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) ఒక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే పాఠశాల ప్రిన్సిపల్. నిబంధనల విషయంలో ఆయన ఎలాంటి రాజీ పడరు. చిన్ననాటి నుంచే ఆయన కుమార్తె వైశాలి (యశశ్రీ రావు)పై ప్రేమ పెంచుకున్న సంతోష్ (విరాజ్ అశ్విన్) ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరకు ఆమెను వివాహం చేసుకునే అవకాశం దక్కించుకుంటాడు. చివరికి రఘునాథ్ కూడా ఈ వివాహానికి అంగీకారం తెలుపుతాడు. పెళ్లి ఖరారైన ఆనందంలో సంతోష్ తన చిన్ననాటి స్నేహితులు బొమ్మ ఆనంద్ (గోదావరి గోపి), గణేశ్ (వివా రాఘవ), శ్రీకాంత్ (పవన్ సిద్ధు)తో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం గోవాకు వెళ్తాడు.

వివరాలు

తలకిందులు చేసిన అనుకోని ప్రమాదం..

అక్కడ జరిగిన ఓ అనుకోని ప్రమాదం అతడి జీవితాన్నే తలకిందులు చేస్తుంది. ప్రమాదం తర్వాత సంతోష్ తన గత జ్ఞాపకాలను కోల్పోతాడు. ఇటీవల జరిగిన కొన్ని రోజుల సంఘటనలు మాత్రమే అతడికి గుర్తుంటాయి. పెళ్లికి కొద్ది రోజుల ముందు ఈ పరిస్థితి ఏర్పడటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర ఆందోళన చెందుతారు. పెళ్లి జరిగేలోపు సంతోష్‌కు జ్ఞాపకాలు తిరిగి వచ్చేలా చేయాలనే ప్రయత్నాలు మొదలుపెడతారు. అతడికి గతం గుర్తులేదనే విషయం బయటపడకుండా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వైశాలి కుటుంబానికి ఈ నిజం తెలిసిందా? చివరికి పరిస్థితి ఎలా మారింది? అనే ప్రశ్నలకు సమాధానం ఈ సిరీస్‌లో దొరుకుతుంది.

Advertisement

వివరాలు

ఎలా ఉంది?

మతిమరుపు నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా వినోదాన్ని అందించాయి. ఈ తరహా కథల్లో వాస్తవికత కంటే కథనం, పాత్రల ప్రవర్తన, భావోద్వేగాలు, హాస్యమే ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. అదే అంశాన్ని దర్శకుడు వినోద్ గాలి సమర్థంగా ఉపయోగించుకున్నారు. సిరీస్ ప్రారంభంలోనే ప్రధాన పాత్రలు, వారి కుటుంబాలు, స్నేహబంధాలు, ప్రేమకథను నెమ్మదిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తారు. మొదటి భాగంలో కథనం కొంత నిదానంగా అనిపించినా, గోవాలో జరిగిన ప్రమాదం తర్వాత అసలు కథ మొదలవుతుంది.

Advertisement

వివరాలు

అలరించే కామెడీ సీన్స్..

సంతోష్‌కు జ్ఞాపకాలు పోయిన విషయం వైశాలి కుటుంబానికి తెలియకుండా దాచేందుకు అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులు, ఆ పరిస్థితుల నుంచి పుట్టే హాస్యం సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఒకవైపు ఉత్కంఠను కొనసాగిస్తూనే మరోవైపు నవ్వులు పంచడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. గతం, వర్తమానం అనే రెండు కాలరేఖలను సమాంతరంగా నడిపిస్తూ కథను ఆసక్తికరంగా మలిచారు. హీరో చిన్ననాటి జ్ఞాపకాలను చూపించే సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. అయితే దర్శకుడు ప్రధానంగా వర్తమానంలో జరిగే సంఘటనలపైనే దృష్టి సారించారు. సంతోష్‌కు పాత విషయాలు గుర్తు చేయడానికి అతడి స్నేహితులు చేసే ప్రయత్నాలు, వాటి వల్ల ఏర్పడే హాస్యభరిత పరిస్థితులు ప్రేక్షకులను అలరిస్తాయి.

వివరాలు

నటీనటుల ప్రతిభ..

జ్ఞాపకశక్తి కోల్పోయిన సంతోష్ పాత్రలో విరాజ్ అశ్విన్ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. హావభావాలు, భావోద్వేగాలను చక్కగా వ్యక్తీకరిస్తూ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. వైశాలి పాత్రలో యశశ్రీ రావు కూడా తన పాత్రను సమర్థంగా పోషించారు. స్నేహితుల పాత్రల్లో వివా రాఘవ, పవన్ సిద్ధు, గోదావరి గోపి మంచి వినోదాన్ని అందించారు. శివన్నారాయణ నటన కూడా సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోహిణి హట్టంగడి, ప్రియదర్శిని రామ్ తమ అనుభవాన్ని ప్రతిబింబించేలా పాత్రలకు బలం చేకూర్చారు.

వివరాలు

కుటుంబంతో చూడొచ్చా?

సాంకేతిక పరంగా కూడా సిరీస్ మంచి స్థాయిలో ఉంది. దర్శకుడు వినోద్ గాలి మెమొరీ లాస్ కాన్సెప్ట్‌ను కొత్తగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో కొత్త పాత్రలను దశలవారీగా ప్రవేశపెడుతూ సంఘర్షణను పెంచడం వల్ల కథనం ఎక్కడా బోరింగ్‌గా అనిపించదు. భావోద్వేగ సన్నివేశాలను కూడా తనదైన శైలిలో మలిచి ప్రేక్షకులను కథతో అనుసంధానించారు. ఈ వెబ్‌సిరీస్‌ను కుటుంబ సభ్యులతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీక్షించవచ్చు. మొత్తం ఏడు ఎపిసోడ్‌లు ఉండగా, ఒక్కో ఎపిసోడ్ సుమారు అరగంట నిడివి కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈటీవీ విన్ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement