పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎన్నికలే ఆపుతున్నాయా? నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో బ్రో సినిమా జులై 28వ తేదీన రిలీజ్ అవుతుంది. ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగులు గతకొన్ని రోజులుగా జరగట్లేదు. హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసాడని అన్నారు. ఒక దశలో అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్న అనుమానం అభిమానుల్లో కూడా కలిగింది. తాజాగా ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ నిర్మాత ఏఎమ్ రత్నం, హరిహర వీరమల్లు షూటింగ్ పై అప్డేట్ ఇచ్చారు.
హరిహర వీరమల్లు షూటింగ్ ని నిర్ణయించేవి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే
పాన్ ఇండియా రేంజ్ లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రం కోసం పవన్ కళ్యాణ్ చాలా డేట్స్ కేటాయించాల్సి వస్తుంది. ఆల్రెడీ చేతిలో ఉన్న చిత్రాలు, రాజకీయంగా బిజీగా ఉండడం వల్ల అంత సమయం పవన్ కళ్యాణ్ కు దొరకడం కష్టమే. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది జరిగితే, అప్పటివరకు పవన్ కళ్యాణ్ కు సమయం ఉంటుంది కాబట్టి వచ్చే నెల ఆగస్టులో హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభమవుతుందని ఏఎమ్ రత్నం అన్నారు. ఒకవేళ అలా కాకుండా అనుకున్న సమయం కంటే ముందుగా ఎన్నికలు జరిగితే ఎలక్షన్లు పూర్తయిన తర్వాతే హరిహర వీరమల్లు షూటింగ్ ఉంటుందని ఏఎమ్ రత్నం చెప్పుకొచ్చారు.