Meher Ramesh: సోషల్ ఫిల్మ్గా మొదలై సోషియో ఫాంటసీగా మారిన 'శక్తి'
ఈ వార్తాకథనం ఏంటి
శక్తి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించగా, దీనికి మెహెర్ రమేష్ దర్శకత్వం వహించారు. నాయికగా ఇలియానా కనిపించారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అశ్విని దత్త్ నిర్మించారు. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. అసలు మెహర్ రమేశ్ చెప్పిన కథ వేరే ఉందట. 'కంత్రీ' తర్వాత నిర్మాత అశ్వినీదత్ను కలిసిన మెహర్ రమేశ్, ఒక సామాజిక అంశాలతో కూడిన సినిమా చేయాలనే ఆలోచనను వ్యక్తం చేశారు. అదే కథను ఎన్టీఆర్కు వినిపించగా,ఇద్దరికీ ఎంతో నచ్చిందట. పరిశ్రమలో తనకు సన్నిహితులైన దర్శకుడు వి.వి.వినాయక్,హీరో అల్లు అర్జున్ లకు కూడా కథ వివరించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారట.
వివరాలు
సోషియో ఫాంటసీ కథగా మారిన 'శక్తి'
వారందరికీ ఆ కథ నచ్చినట్లు సమాచారం.అయితే అదే సమయంలో ఎన్టీఆర్ ముందుగా బృందావనం చిత్రానికి తన తేదీలను కేటాయించాల్సి రావడంతో,ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ఈ దశలో నిర్మాత అశ్వినీదత్కు కొత్త ఆలోచన వచ్చింది. ఎన్టీఆర్తో పాతాళ భైరవి, జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఓ విస్తృతమైన సోషియో ఫాంటసీ చిత్రం రూపొందించాలని భావించారు. ఇందుకోసం అప్పటికే అనుభవజ్ఞులైన రచయితలను సంప్రదించి, తన ఆలోచనలను వివరించారు. ఫలితంగా మొదట సామాజిక కథగా భావించిన 'శక్తి' రూపం మారి, సోషియో ఫాంటసీ కథగా మారింది. ప్రారంభంలో సుమారు రూ.25 కోట్లలో చిత్రాన్ని పూర్తి చేయాలనే ప్రణాళికతో షూటింగ్ ప్రారంభించినా, వ్యయం క్రమంగా పెరిగి భారీ బడ్జెట్ చిత్రంగా మారింది.
వివరాలు
తీవ్ర నిరాశ కలిగించిన సినిమా 'శక్తి' : అశ్విన్ దత్
ఆధ్యాత్మిక నేపథ్య కథలపై తనకు విస్తృత పరిజ్ఞానం లేకపోయినా, సాధ్యమైనంత శ్రమించి సినిమా తీశానని మెహర్ రమేశ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకవేళ ఎన్టీఆర్తో 'మిషన్ ఇంపాజిబుల్' తరహా యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించి ఉంటే ఫలితం ఎలా ఉండేదో అనిపిస్తుందని కూడా అభిప్రాయపడ్డారు. ఇక ఈ చిత్రంపై నిర్మాత అశ్వినీదత్ కూడా గతంలో తన భావాలను వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో తీవ్ర నిరాశ కలిగించిన సినిమా 'శక్తి'నేనని చెప్పారు. ఈ చిత్రం కారణంగా పరిశ్రమను వదిలేయాలనే ఆలోచన కూడా కలిగిందని వెల్లడించారు. నిర్మాణ ఖర్చులు అంచనాలకు మించి పెరగడంతో, దాదాపు రూ.32 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
వివరాలు
రెండు పాత్రల్లో ప్రభాస్
ఈ సంఘటన తనకు పెద్ద షాక్గా మారిందని, ఆ తర్వాత నాలుగైదేళ్ల పాటు సినిమాలు నిర్మించాలనే ఉత్సాహం తగ్గిపోయిందని చెప్పారు. అనంతరం తన పిల్లలు నిర్మాణ బాధ్యతలు చేపడతామని చెప్పడంతో ఒప్పుకుని, మంచి సినిమాలు చేయడంలో వారిని ప్రోత్సహిస్తూ కొనసాగుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైజయంతి సినిమాలు, స్వప్నా సినిమా బ్యానర్లపై వరుస చిత్రాలు రూపొందుతున్నాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD చిత్రానికి కొనసాగింపుగా 'కల్కి 2' రూపొందనుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే సాధారణ చిత్రీకరణ ప్రారంభానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మహాభారత అంశాలతో మేళవించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నఈ చిత్రంలో ప్రభాస్ భైరవగా, కర్ణగా రెండు పాత్రల్లో అలరించనున్నారు.