Rashmi Gautam: నేను వెనక్కి తగ్గను.. రష్మీ గౌతమ్ స్ట్రాంగ్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
తాను ఏ మతానికి గానీ, రాజకీయ పార్టీకీ గానీ వ్యతిరేకం కాదని, జంతువులపై జరిగే క్రూరత్వానికే వ్యతిరేకమని నటీమణి రష్మీ గౌతమ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్కు ఆమె ఘాటుగా స్పందించారు. వైసీపీ నేత ప్రదీప్ చింత చేసిన విమర్శలపై ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విమర్శలు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని, గతంలోనూ పలుమార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపారు. ఇలాంటి అవమానాలు వినడం నాకు ఇదే మొదటిసారి కాదు. నా సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తే పండుగల సమయంలో జరిగే జంతుబలి అంశాలపై కూడా నేను ఎప్పటికప్పుడు స్పందించానని తెలుస్తుంది.
వివరాలు
నన్ను దేశద్రోహిగా అభివర్ణించారు
అప్పుడు కూడా నన్ను తీవ్రంగా విమర్శించారు. గణపతికి గజమాల వేసే సమయంలో అంకుశంతో ఏనుగు చర్మాన్ని గాయపరచడంపై ప్రశ్నించగా నన్ను దేశద్రోహిగా కూడా అభివర్ణించారు. జంతువులపై హింస విషయంలో ప్రజలు ఒకదానితో మరోదాన్ని పోల్చుకుంటూ చర్చలు జరిపినా, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆమె పేర్కొన్నారు. జంతువులపై జరుగుతున్న హింసపై నేను ఎన్నోసార్లు మాట్లాడాను, ఇక ముందు కూడా మాట్లాడుతూనే ఉంటాను. కానీ ఒక సమస్యను ప్రస్తావిస్తే ప్రజలు మరో అంశాన్ని లాగి పోల్చడం తప్ప, ఈ హింసను ఆపడానికి ముందుకు రావడం లేదు.
వివరాలు
నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు
నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. జంతు సంక్షేమం కోసం పనిచేసే ఏ పార్టీ అయినా ఉంటే, ఆ పార్టీకి నేను బహిరంగంగా మద్దతు ఇస్తానని రష్మీ తన పోస్టులో తెలిపారు. ఇదంతా ప్రారంభమైనది వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి చేపట్టిన నిరసన ర్యాలీతో. ఇంధన ధరల పెరుగుదలపై ఆయన నిర్వహించిన ర్యాలీలో ఆటోను ఎడ్ల బండిపై ఉంచి ప్రదర్శన చేయడం జరిగింది. దీనిపై స్పందించిన రష్మీ, రాజకీయ నిరసనల కోసం జంతువులను ఉపయోగించడం, వాటిపై హింస చూపడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రచారం కోసం జంతువులపై క్రూరత్వం ప్రదర్శించడం హేయమని పేర్కొన్నారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.