Jana Nayagan: 'జన నాయగన్' పూర్తి రీమేక్ కాదు.. అసలు నిజం బయటపెట్టిన దర్శకుడు వినోత్!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఈ వార్తలపై ఇప్పుడు దర్శకుడు హెచ్. వినోత్ స్వయంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చారు. వినోత్ మాట్లాడుతూ.. 'జన నాయగన్' 'భగవంత్ కేసరి'కి రీమేక్ అనే విషయం నిజమే. అయితే దానిని పూర్తిగా రీమేక్ చేయలేదు. అసలు కథలో కేవలం 50 శాతం మాత్రమే తీసుకున్నాం. ఫస్ట్ హాఫ్లో సుమారు 60శాతం, సెకండ్ హాఫ్లో 20 శాతం మాత్రమే 'భగవంత్ కేసరి' ప్రభావం ఉంటుందని వెల్లడించారు.
వివరాలు
కథలో చాలా మార్పులు చేశాం
అలాగే విజయ్ కోసం మొదట పూర్తిగా కొత్త కథ సిద్ధం చేశానని, అయితే అది చాలా సీరియస్గా ఉందని ఆయన భావించారని వినోత్ తెలిపారు.
అనంతరం 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేయాలని విజయ్ స్వయంగా సూచించారని చెప్పారు.
బాలకృష్ణ శైలి, విజయ్ శైలి పూర్తిగా భిన్నంగా ఉంటాయని, అందుకే కథలో అనేక మార్పులు చేశామని వివరించారు.
'నేర్కొండ పార్వై' తర్వాత మరోసారి రీమేక్ సినిమా చేయాలా అనే సందేహం నాకు కూడా వచ్చింది. కానీ ఇది విజయ్ చివరి సినిమా కావడంతో ఆ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదని వినోత్ పేర్కొన్నారు.
వివరాలు
సినిమా బాగా వచ్చింది
రీమేక్ చేయాల్సిన అవసరం ఏమిటని తాను విజయ్ను ప్రశ్నించగా, 'భగవంత్ కేసరి'లో తనకు నచ్చిన ప్రతి సన్నివేశాన్ని విజయ్ సీన్ బై సీన్ వివరించారని దర్శకుడు చెప్పారు.
ముఖ్యంగా మహిళా సాధికారత అంశం తనను బాగా ఆకట్టుకుందని విజయ్ చెప్పినట్లు వెల్లడించారు. అలాగే 'ఇదే విజయ్ చివరి సినిమా అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు.
అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి వచ్చే తొలి సినిమాగా దీనిని చూడొచ్చని వినోత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
రెండుసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా
'జన నాయగన్' కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదని, విజయ్ను హీరోయిక్గా చూపించడానికే ఈ చిత్రాన్ని రూపొందించలేదని ఆయన స్పష్టం చేశారు.
సున్నితమైన రాజకీయాల నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాలను కూడా వినోత్ పంచుకున్నారు.
'జన నాయగన్' విషయంలో తాను రెండుసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.
సెన్సార్ ఆలస్యం కావడంతో సినిమా పొంగల్కు విడుదల కాకపోవడం ఒకసారి బాధ కలిగించిందని, మరోసారి సినిమా ఆన్లైన్లో లీక్ అయి పైరసీని అడ్డుకోలేకపోవడం తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించారు.