HBD Kajal Aggarwal: హ్యాపీ బర్త్డే కాజల్..'చందమామ' నుంచి స్టార్ హీరోయిన్ వరకు సినీ ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
"పంచదార బొమ్మ"గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ నేడు తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దాదాపు పదేళ్లకు పైగా టాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగిన ఆమె, తెలుగు సినీ పరిశ్రమలోని దాదాపు అన్ని స్టార్ హీరోలతో జతకట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.
వివరాలు
తెలుగు సినీ పరిశ్రమలో తొలి అడుగు..
కాజల్ అగర్వాల్ 2007లో దర్శకుడు తేజ రూపొందించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయమయ్యారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా, అదే ఏడాది కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కాజల్కు మంచి గుర్తింపును తీసుకువచ్చి, తెలుగుతో పాటు తమిళ చిత్రసీమ నుంచి కూడా వరుస అవకాశాలు అందేలా చేసింది.
వివరాలు
కెరీర్ను మలుపు తిప్పిన విజయాలు..
2009లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'మగధీర' సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన కాజల్ కెరీర్లో ఇది అత్యంత కీలకమైన చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ద్విపాత్రాభినయంలో చూపిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కాజల్ వరుస విజయాలను అందుకున్నారు. ప్రభాస్తో 'డార్లింగ్', జూనియర్ ఎన్టీఆర్తో 'బృందావనం' (2010), మరోసారి ప్రభాస్తో 'మిస్టర్ పర్ఫెక్ట్' (2011), మహేష్ బాబుతో 'బిజినెస్మెన్' (2012) వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని మరింత బలపర్చుకున్నారు.
వివరాలు
తెలుగు మాత్రమే కాదు.. హిందీ, తమిళంలోనూ సత్తా..
తెలుగులో విజయాల పరంపర కొనసాగుతున్న సమయంలో కాజల్ హిందీ చిత్రసీమలో కూడా అడుగుపెట్టారు. అజయ్ దేవగన్తో కలిసి నటించిన 'సింగం' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. అదే సమయంలో తమిళంలో విజయ్తో కలిసి చేసిన 'తుపాకి' కూడా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు కాజల్కు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు, మార్కెట్ను తీసుకొచ్చాయి.
వివరాలు
కెరీర్లో ఎదురైన ఒడిదుడుకులు..
వరుస విజయాలతో దూసుకెళ్లిన కాజల్ కెరీర్లో కొంతకాలం నిరాశలు కూడా ఎదురయ్యాయి. 'సరదాగా అమ్మాయితో', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బ్రహ్మోత్సవం' వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే 2017లో వచ్చిన 'ఖైదీ నంబర్ 150', 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు ఆమెను మళ్లీ విజయాల బాట పట్టించాయి. స్టార్ హీరోయిన్గా అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే 'పక్కా లోకల్' అనే ప్రత్యేక గీతంలో నటించి కాజల్ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. సాధారణంగా అగ్ర కథానాయికలు స్పెషల్ సాంగ్స్కు దూరంగా ఉండే సమయంలో ఆమె అలాంటి పాటలో నటించడం సినీ వర్గాల ప్రశంసలు అందుకుంది.
వివరాలు
పెళ్లి, మాతృత్వం తర్వాత రీఎంట్రీ..
2020లో గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న కాజల్, 2022లో కుమారుడు జన్మించిన తర్వాత దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చారు. అనంతరం 2023లో 'భగవంత్ కేసరి' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత 'సత్యభామ' వంటి మహిళా ప్రధాన చిత్రంలో నటించి తనలోని మరో నటనా కోణాన్ని చాటిచెప్పారు. ప్రస్తుతం 'ఇండియన్ 2' వంటి భారీ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.