Mammootty: నటులంతా నటిస్తూనే చనిపోవాలని కోరుకుంటారు.. మమ్ముట్టి కామెంట్స్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సినీ రంగంలోని ప్రముఖ నటులు మమ్ముట్టి, మోహన్లాల్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'పేట్రియట్'. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. వేసవి సీజన్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మమ్ముట్టి, ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "చాలామంది నేను సినీ రంగంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయ్యాయని భావిస్తారు. అయితే నిజానికి నా మొదటి సినిమా, రెండవ సినిమా మధ్య దాదాపు తొమ్మిదేళ్ల విరామం ఉంది. 1971లో ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించాను. కానీ చాలామంది నా కెరీర్ను అక్కడి నుంచే లెక్కించడం ప్రారంభించారు. వాస్తవానికి నా నటనా ప్రయాణం 1981లో మొదలైంది." అని తెలిపారు.
వివరాలు
ఏడాదికి 15 సినిమాలు..
మొదటి సినిమా అనంతరం తాను న్యాయశాస్త్రం అభ్యసించానని, సుమారు రెండున్నర సంవత్సరాలు న్యాయవాదిగా పని కూడా చేశానని చెప్పారు. ఆ సమయంలోనే తనకు మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చానని, ఇప్పటి వరకు 400కి పైగా చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. కెరీర్ ప్రారంభ దశలో సుమారు 35 సినిమాల్లో చిన్న పాత్రలు పోషించానన్నారు. ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా కూడా నటించానని, కొన్ని సందర్భాల్లో సంవత్సరానికి 15 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
వివరాలు
నటిస్తూ చనిపోతా..
ఈ రంగంలోకి రావాలంటే ఒత్తిడిని భరించే శక్తి తప్పనిసరి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలని కోరుకుంటారు. తానూ అదే భావిస్తానని, నటిస్తూ ఉండగానే జీవితం ముగియాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఒక నటుడికి అంతకంటే పెద్ద ఆనందం ఉండదని, శరీరం బలహీనంగా ఉన్నా, అలసటగా ఉన్నా, ఓపిక లేకపోయినా, ఒక నటుడికి పాత్ర గురించి చెప్పగానే అతను నటించడానికి సిద్ధమవుతాడని అన్నారు. సెట్లోకి వచ్చాక తన పాత్రను పూర్తిగా న్యాయం చేయడానికి శ్రమిస్తానని తెలిపారు. ఇదే ఈ సినీ పరిశ్రమ ప్రత్యేకత అని మమ్ముట్టి చెప్పుకొచ్చారు.