రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రంగమార్తాండ సినిమా, ఉగాది రోజున థియేటర్లలోకి వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అతిరథ మహారథులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రంగమార్తాండ సినిమా గురించి మాట్లాడారు. ఒక నటుడు తన జీవితాన్ని తన కళ్లతో చూస్తున్నట్టుగా రంగమార్తాండ ఉందనీ, ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ, బ్రహ్మానందంల కలయిక త్రివేణి సంగమంలా అనిపించిందని అన్నారు. బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ, ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్రను బ్రహ్మానందం చేయడం ఇదే తొలిసారని ఆయన గుర్తు చేసారు. సెకండాఫ్ మొత్తం, కళ్ళలో తడి చేరుకుందని, ఇలాంటి సినిమాలను ఆదరించాలని మెగాస్టార్ అభిప్రాయ పడ్డారు. రంగమార్తాండ సినిమా తీసినందుకు కృష్ణవంశీకి, అందులో నటించిన వారందరికీ అభినందనలు తెలియజేసారు.
రంగమార్తాండ సినిమాలో వినిపించిన చిరంజీవి గొంతు
రంగమార్తాండ సినిమాకు చిరంజీవి తన గొంతుకను అందించారు. నేనొక నటుడిని అంటూ సాగే షాయరీని తన గొంతుకలో వినిపించారు చిరంజీవి.ఈ షాయరీతోనే సినిమా మొదలవడం విశేషం. మరాఠీ సినిమాయైనా నటసామ్రాట్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది రంగమార్తాండ చిత్రం. రంగస్థలం మీద ఎన్నో పాత్రలు వేసిన కళాకారుడు, తన జీవితంలో నటించలేక ఇబ్బందుల పాలవుతాడు. ఇదే రంగమార్తాండ కథ. ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలతో పాటు రమ్యకృష్ణ, అనసూయ భరధ్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామలా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీకి సంగీతాన్ని ఇళయరాజా సమకూర్చారు.