Wedding Of Virosh: భావోద్వేగాలతో నిండిన క్షణాలు.. 'విరోష్' పెళ్లి చూడడం గొప్ప గౌరవమన్న నటి
ఈ వార్తాకథనం ఏంటి
అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఆ క్షణం ఫిబ్రవరి 26న సాకారమైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మంధన్న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్ పూర్ వేదికగా జరిగిన వీరి వివాహ వేడుక 'Wedding Of Virosh'పేరుతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నటి కళ్యాణి ప్రియదర్శి హాజరై సందడి చేసింది. తాజాగా ఆమె ఈ పెళ్లిని ప్రత్యక్షంగా చూడటం తన అదృష్టమంటూ భావోద్వేగ పోస్టు చేశారు. పెళ్లి ఫోటోను షేర్ చేసిన కల్యాణి తన ఇన్స్టా స్టోరీలో ఈ జంటపై హృదయపూర్వకంగా రాసుకొచ్చారు. రష్మిక తన ప్రాణ స్నేహితుడిని వివాహం చేసుకోవడం చూశాను. ఆమె మండపం వైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు వారిద్దరి కళ్లల్లో ఆనందభాష్పాలు వారి ప్రేమకు ప్రతీకగా కనిపించాయి.
Details
సోషల్ మీడియాలో పోస్టు వైరల్
ప్రతి అడుగు అనేక భావోద్వేగ క్షణాలను మోసుకొచ్చినట్టే అనిపించింది. వారి మౌనం అన్నిటికీ సమాధానంలా నిలిచింది. స్నేహం నుంచి ప్రేమగా మారి ఒక్కటైన ఈ జంటను చూడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది వారికి మరో అందమైన ఆరంభమని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఇక తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న విజయ్, రష్మిక ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను స్పష్టంగా తెలియజేశారు. నా ప్రాణ స్నేహితురాలు ఇప్పుడు నా భార్య అయ్యిందంటూ విజయ్ ఆనందం వ్యక్తం చేయగా, నా భర్త విజయ్... అంటూ రష్మిక ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.