LOADING...
OTT Movies: ఓటీటీ వైపు తెలుగు తారల అడుగులు..ఆ హీరోలు స్పెషల్ ఫోకస్
ఓటీటీ వైపు తెలుగు తారల అడుగులు..ఆ హీరోలు స్పెషల్ ఫోకస్

OTT Movies: ఓటీటీ వైపు తెలుగు తారల అడుగులు..ఆ హీరోలు స్పెషల్ ఫోకస్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 30, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల నిర్మాణంపైనా తెలుగు నటీనటులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కథ లభిస్తే చాలు... ఓటిటి ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో వెంటనే అంగీకారం తెలుపుతున్నారు. రాబోయే కాలంలో వెబ్‌ కంటెంట్‌తో పాటు అందులో కనిపించే తారల సంఖ్య మరింత పెరగడం ఖాయం అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వెబ్‌ సిరీస్‌ల విషయంలో మాత్రం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తారలు థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలపైనా దృష్టి సారిస్తూ సినిమాలు, సిరీస్‌లలో నటించేందుకు ముందుకొస్తున్నారు.

వివరాలు 

ఓటీటీల్లో ఆ హీరోలు బిజీ బిజీ..

ఇప్పటికే వెంకటేష్, రానా దగ్గుబాటి, నాగ చైతన్య వంటి ప్రముఖులు ఓటీటీ వేదికలపై తమ ప్రతిభను చూపించారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్‌ అబ్బవరం, సుధీర్‌బాబు, ఆనంద్‌ దేవరకొండ వంటి యువ కథానాయకులు కూడా ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. నాగచైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'ధూత' సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై మంచి ఆదరణ పొందింది. అతీంద్రియ అంశాలు, నేర కథాంశం కలిసిన ఈ థ్రిల్లర్‌కి కొనసాగింపుగా రెండో సీజన్‌ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అలాగే సిద్ధు జొన్నలగడ్డ నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

వివరాలు 

వరుస సీరిస్‌లు చేస్తున్న హీరోలు..

కిరణ్‌ అబ్బవరం ప్రధాన పాత్రలో భరత్‌ కమ్మ దర్శకత్వంలో 'గువ్వలచెరువు ఘాట్‌' అనే సిరీస్‌ రూపొందుతోంది. మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నిర్మిస్తోంది. ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌. మరోవైపు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో 'తక్షకుడు' అనే చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌గా నేరుగా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. సుధీర్‌బాబు ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో 'గల్లీ' అనే సిరీస్‌ రూపొందుతోంది. దీన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నిర్మిస్తోంది. తేజ సజ్జా 'ది ట్రైటర్స్‌' అనే అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన రియాలిటీ షోకు తెలుగు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఆ వరుసలో హీరోయిన్లు కూడా..

కథానాయికల విషయానికి వస్తే సమంత, తమన్నా, సాయిపల్లవి వంటి అగ్రనటుల నుంచి వర్ష బొల్లమ్మ వంటి కొత్త తరం నాయికల వరకు అనేక మంది వెబ్‌ కంటెంట్‌లో నటించి గుర్తింపు పొందారు. బాలీవుడ్‌లో కరీనా కపూర్‌, కియారా అడ్వాణీ వంటి ప్రముఖులతో పాటు కొత్త తరం నటీమణులు కూడా ఓటీటీ వేదికలపై చురుకుగా పాల్గొన్నారు. కుటుంబ కథలతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్‌ ఇటీవల రానా దగ్గుబాటితో కలిసి 'రానా నాయుడు' సిరీస్‌లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌తో ఆయన విభిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. బాబాయి-అబ్బాయి కలయికగా వచ్చిన ఈ ప్రాజెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరుకుంది.

Advertisement

వివరాలు 

కారణాలు ఇవేనా? 

ఓటీటీ కంటెంట్‌ విస్తృతంగా అందుబాటులో ఉండటమే కాకుండా నటులకు కొత్త రకాల పాత్రలు పోషించే స్వేచ్ఛను ఇస్తుంది. సినిమా కథలు ఎక్కువగా ఒకే విధమైన ఫార్మాట్‌లో సాగుతుంటే, వెబ్‌ సిరీస్‌లలో మాత్రం ప్రయోగాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నటులు తమ ప్రతిభను విభిన్న కోణాల్లో చూపించడానికి ఇది ఒక మంచి వేదికగా మారింది. 'రానా నాయుడు'లో వెంకటేష్, రానా దగ్గుబాటి పాత్రలు నెగటివ్‌ షేడ్స్‌తో కూడినవిగా ఉండటం దీనికి ఉదాహరణ. ఇంటింటికీ సులభంగా చేరడం, కొత్త తరహా పాత్రలు చేయడానికి అవకాశం ఉండటం, ఆకర్షణీయమైన పారితోషికం లభించడం వంటి కారణాలతో తారలు వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement