BRO: పవన్ కళ్యాణ్ 'బ్రో' ట్రైలర్ వచ్చేసింది; మనుషులందరూ భస్మాసురులే అంటున్న పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ అభిమానులకు మాంచి ట్రీట్ దొరికేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో ట్రైలర్ రిలీజైంది. మనుషులందరూ భస్మాసురులే అని, ప్రతీ ఒక్కరూ తమ తల మీద తామే చేయి పెట్టుకుంటారనే పవన్ కళ్యాణ్ డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ప్రతీ దానికి టైమ్ చూసుకునే సాయి ధరమ్ తేజ్ పాత్రను పరిచయం చేసారు. దేనికీ టైమ్ లేదనుకుని సాయి ధరమ్ తేజ్ కంగారు పడిపోతుంటే, కాలమే దేవుడి రూపంలో వచ్చినట్లు పవన్ కళ్యాణ్ని చూపించారు. దేవుడిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వగానే సాయి ధరమ్ తేజ్ పాత్ర జీవితంలో రకరకాల వింతలు జరిగినట్టు చూపించారు.
వివిధ రకాల గెటప్పుల్లో పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పాత్రల మధ్య వచ్చే సీన్లు మంచి వినోదాన్ని అందించే విధంగా ఉన్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వివిధ గెటప్పుల్లో కనిపించనున్నాడని ట్రైలర్ లో చూపించారు. ఆ గెటప్పులు అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే బ్రో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సిన అంశాలన్ని ఉన్నట్టుగా ట్రైలర్ ని కట్ చేసారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని సముద్రఖని డైరెక్ట్ చేసారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా, జులై 28న విడుదల అవుతుంది.