Pawan Kalyan: పవన్ కళ్యాణ్ 'ఓజీ' చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, సమయం దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అంతకుముందు విడుదలైన 'ఓజీ' సినిమా మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
వివరాలు
సినిమా చూపిస్తూ సర్జరీ
ఇదిలా ఉండగా, ప్రకాశం జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళకు మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు, ఆపరేషన్ సమయంలో 'ఓజీ' సినిమాను ప్రదర్శిస్తూ సర్జరీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కోటేశ్వరమ్మ కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమె మెదడులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. బ్రెయిన్ సర్జరీ కావడంతో శస్త్రచికిత్స సమయంలో రోగికి పూర్తిస్థాయి మత్తు ఇవ్వకుండా వైద్యులు చికిత్స చేపట్టారు.
వివరాలు
ల్యాప్ టాప్ ద్వారా మూవీ చూపించిన డాక్టర్లు
ఆపరేషన్ సమయంలో ఆమె శరీర కదలికలను పరిశీలించాల్సిన అవసరం ఉండటంతో వైద్యులు ప్రత్యేక పద్ధతిని అనుసరించారు. కోటేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం ఉండటాన్ని గుర్తించిన వైద్యులు, ఆపరేషన్ థియేటర్లో ల్యాప్టాప్ ద్వారా 'ఓజీ' సినిమాను ప్రదర్శించారు. ఆమె సినిమా చూస్తూ పూర్తిగా అందులో లీనమైన సమయంలో వైద్యులు అత్యంత జాగ్రత్తగా మెదడులోని గడ్డను తొలగించారు. ప్రస్తుతం కోటేశ్వరమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.