LOADING...
Suniel Narang: మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్ ను తక్కువ ధరకు అమ్మలేం.. సునీల్ నారంగ్ సంచలన కామెంట్స్
మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్ ను తక్కువ ధరకు అమ్మలేం.. సునీల్ నారంగ్ సంచలన కామెంట్స్

Suniel Narang: మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్ ను తక్కువ ధరకు అమ్మలేం.. సునీల్ నారంగ్ సంచలన కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోవడానికి టికెట్ ధరలతో పాటు స్నాక్స్, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ అధిక ధరలు కూడా ప్రధాన కారణమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో అమ్మే ఆహార పదార్థాల ధరలు సామాన్య ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయని తరచూ విమర్శలు వినిపిస్తున్నాయి. బయట రూ.20కు దొరికే పాప్‌కార్న్, మల్టీప్లెక్స్‌లో మాత్రం రూ.200 నుంచి ప్రారంభమవుతుండగా, కూల్‌డ్రింక్స్ ధరలు కూడా కనీసం రూ.150 వరకు ఉంటున్నాయి. కొన్ని చోట్ల పాప్‌కార్న్ ధరలు రూ.350 నుంచి రూ.400 దాటుతున్నాయని ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్‌లలో అధిక స్నాక్స్ ధరలపై సామాన్య ప్రజలతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు

ప్రేక్షకులు ఆసక్తి చూపరు

ఈ ధరలను తగ్గించాలని పలువురు కోరుతున్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రం మల్టీప్లెక్స్ నిర్వాహకుల చేతుల్లోనే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ నారంగ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థియేటర్లలోని స్నాక్స్ ధరలపై స్పందించారు. ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేతగా, అలాగే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన.. మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్ ధరలు తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. "సింగిల్ స్క్రీన్ థియేటర్లలో స్నాక్స్ ధరలు తగ్గించే అవకాశం ఉండొచ్చు. కానీ మల్టీప్లెక్స్‌లలో అది సాధ్యం కాదు. అక్కడ ధరలు తగ్గిస్తే నిర్వహణ ఖర్చులు భరించడం కష్టమవుతుంది. మల్టీప్లెక్స్‌లలో తక్కువ ధరలకు ఇడ్లీ, వడ వంటి పదార్థాలు అమ్మితే ప్రేక్షకులు ఆసక్తి చూపరు.

వివరాలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తక్కువ ధర

మల్టీప్లెక్స్‌లోకి అడుగుపెట్టగానే పాప్‌కార్న్ వాసన రావాలని వ్యాఖ్యానించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పాప్‌కార్న్ ధరలు ఇంకా కొంతవరకు అందుబాటులోనే ఉన్నాయని, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం స్నాక్స్ ధరలు తక్కువగానే ఉండాలని అభిప్రాయపడ్డారు. ముంబైలో స్నాక్స్ ధరలు విపరీతంగా పెరగడం వల్లే అక్కడి సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్రమంగా మూతపడిపోయాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పాప్‌కార్న్ ధరలు తగ్గించడం సాధ్యం కాదంటూ సునీల్ నారంగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుండగా, మల్టీప్లెక్స్‌లలో స్నాక్స్ ధరలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది.

Advertisement