Ram charan: తమిళనాడు సీఎంగా విజయ్ను చూసి గర్వంగా ఉంది: రామ్చరణ్
ఈ వార్తాకథనం ఏంటి
సినీ రంగంలో అత్యున్నత విజయాలను అందుకుంటున్న సమయంలో స్టార్ ఇమేజ్ను పక్కనపెట్టి ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ నిర్ణయం ప్రశంసనీయమని హీరో రామ్ చరణ్ అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జోసెఫ్ విజయ్ను చూసి ఎంతో గర్వంగా అనిపిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రామ్చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదలకు సిద్ధంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివరాలు
రెండున్నరేళ్ల పాటు శ్రమించిన టీమ్..
సినిమా ప్రచార కార్యక్రమాల భాగంగా శనివారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్చరణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''ఈ సినిమా కోసం మా బృందం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించింది. దర్శకుడు బుచ్చిబాబు అయితే ఐదారు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్పై కృషి చేస్తున్నారు. కథ అవసరాలకు అనుగుణంగా మూడు విభిన్న క్రీడలను నేర్చుకోవడమే కాకుండా, వాటికి తగిన విధంగా శారీరకంగా, మానసికంగా మారడం కూడా సవాలుతో కూడుకున్న పని. అయితే బుచ్చిబాబు రూపొందించిన కథ అలాంటి అంకితభావాన్ని కోరుకుంది.
వివరాలు
ఇండస్ట్రీ గర్వపడే స్థాయిలో సినిమా...
ఈ చిత్రం మొత్తం సినిమా ఇండస్ట్రీ గర్వపడే స్థాయిలో ఉంటుందని నమ్ముతున్నాను. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ రాజ్కుమార్, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు సానా, దివ్యేందు శర్మ, రత్నవేలు తదితరులు పాల్గొన్నారు.