Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లోని ప్రముఖ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు, ఆధారాల సమర్పణకు సంబంధించి న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఈ కేసులోని ముగ్గురు నిందితులు అనారోగ్య కారణాల వల్ల కోర్టుకు హాజరు కాలేకపోయారని వారి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కాగా హీరో అల్లు అర్జున్కు ఈ కేసులో ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే.
వివరాలు
సీసీటీవీ ఫుటేజీలు ఇప్పటికీ అందజేయలేదు
ఈ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు కీలక అభ్యర్థన చేశారు.
కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్తో పాటు డిజిటల్ పరికరాలు (Devices), ఎలక్ట్రానిక్ ఆధారాలు (Electronic Evidence), సీసీటీవీ ఫుటేజీలు ఇప్పటికీ తమకు అందజేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన నాంపల్లి కోర్టు, ఛార్జ్షీట్లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజీలు, సంబంధిత పత్రాలను తదుపరి విచారణకు ముందే నిందితుల న్యాయవాదులకు అందజేయాలని పోలీసులను ఆదేశించింది.
అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.