
NTR: తెలుగోడి పౌరుషం..తెలుగోడి ఆత్మాభిమానం... నందమూరి తారకరామారావు
ఈ వార్తాకథనం ఏంటి
ఒక జమానాలో కథానాయకుడు అంటే తప్పకుండా అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా కనిపించాలి అన్న అభిప్రాయం సినిమారంగంలో రాజ్యమేలేది.
అలాంటి కాలంలో సహజసిద్ధంగా అందంగా ఉన్నప్పటికీ, మేకప్ లేకుండా, అసలు ఆకర్షణ లేకుండా కనిపించే 'పిచ్చి పుల్లయ్య' అనే పాత్రను పోషించి, డీ-గ్లామరైజ్డ్ క్యారెక్టర్ను కూడా కథానాయకుడిగా చేయవచ్చని నిరూపించిన మొదటి నటుడు నందమూరి తారక రామారావు అనే చెప్పాలి.
హీరో అనగానే అందగాడే కావాలి, ధీరోదాత్తుడే కావాలి అన్న సంప్రదాయాన్నిసమూలంగా తుడిచేసిన సృజనాత్మకశీలి.
ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే కావడం, అది ఆయన నిర్మించిన తొలి సినిమా కావడం గమనార్హం.
కొత్తదనాన్ని ఎప్పుడూ వెదికే ఎన్టీఆర్ సృజనాత్మకతకు ఇది గొప్ప ఉదాహరణ.
వివరాలు
హీరో అంటే అందగాడే
పోనీ వేరే భాషల నుంచి ప్రేరణ ఏమైనా ఉందా అంటే.. 1953లో 'పిచ్చి పుల్లయ్య' సినిమా రాకముందు భారతీయ సినిమాల్లో హీరో మాత్రం అందగాడే ఉండాలి అన్న దృక్పథమే నడిచింది.
మహా అయితే అందగాడైన, కథానాయకుడు శాపగ్రస్తుడై తాత్కాలికంగా అందవిహీనంగా మారి మళ్లీ శాపవిమోచనమై అందగాడవుతాడు. అంతే తప్ప సహజంగా అందంలేని పాత్రహీరో కావటానికి ఒప్పుకునేవాళ్లు కాదు.
అయితే ఎన్టీఆర్ ఈ విధానానికి వ్యతిరేకంగా పోయి, తాను స్వయంగా అలాంటి పాత్రల్లో నటించడమే కాకుండా, అది సాధ్యమని ప్రపంచానికి చూపించి, తదుపరి తరాలకు మార్గదర్శిగా నిలిచాడు.
వివరాలు
పాత్రలను కథానాయకులుగా మలిచిన నట మహర్షి
ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేశాడు.'తోడుదొంగలు' చిత్రంలో ముసలివాడిగా, 'రాజుపేద'లో ఆకర్షణలేని వ్యక్తిగా, 'కలిసిఉంటే కలదు సుఖం'చిత్రంలో వికలాంగుడిగా నటించాడు.
ఇదే విధంగా 'గుండిగంటలు','చిరంజీవులు','ఆత్మబంధువు','బడిపంతులు' వంటి సినిమాల్లోను కూడా ఆయన నటన విభిన్నమైన శైలిని చూపించింది.
ఆయన 300కి పైగా చేసిన సినిమాల్లో 1977లో వచ్చిన 'అడవిరాముడు'వరకు సుమారు 75శాతం సినిమాలు ప్రయోగాత్మకమైనవే.
అందులో కొన్ని రీమేకులు కూడా ఉన్నాయి.కానీ 'పిచ్చి పుల్లయ్య','తోడుదొంగలు' 'రాజుపేద' వంటి చిత్రాలు తెలుగు చిత్రసీమకు ప్రత్యేక గౌరవం తీసుకువచ్చాయి.
అందులోనూ 'పిచ్చి పుల్లయ్య','తోడుదొంగలు' సినిమాలు ఎన్టీఆర్ స్వంత నిర్మాణాలు కావడం విశేషం.
ఒక సినిమాతో అందం లేని మనిషిని కథానాయకుడిగా చూపిస్తే,తదుపరి సినిమాలో ముసలివాడిని, పైగా దుష్టుడిని కథానాయకుడిగా మలిచిన ఘనత ఎన్టీఆర్కే చెందుతుంది.
వివరాలు
కథకి నాయకుడైతే ఎవడైనా కథానాయకుడే
'కన్యాశుల్కం'లోని గిరీశం పాత్ర హీరోకాదు, ఎక్కువ మంది హీరోలు ఆ పాత్ర చేయడానికి ముందుకురాలేదు.
కానీ ఎన్టీఆర్ చేయడంతో ఆ పాత్ర గొప్పతనాన్ని పొందింది.
ఇతని గొప్పతనం ఏమిటంటే, కథలో ప్రధాన పాత్రగా ఉన్నఏ పాత్ర అనే కాదు పాత్రల్ని హీరోల్ని చేసే మహానటుడు.
కథకి నాయకుడైతే ఎవడైనా కథానాయకుడే. అది నిరూపించిందీ ఆయనే. గిరీశంలాటి వాడిని కూడా హీరోని చేసింది ఆయనే.
వివరాలు
పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ అగ్రగామి
పౌరాణికాలు, జానపదాలు, చారిత్రకాలు - ఇవి అన్నింటికీ ఎన్టీఆర్ అనుసంధానమే.
తెలుగు ప్రజలతో పురాణాల అనుబంధం ఎప్పుడూ ఉంది. ఇక్కడ అక్షరజ్ఞానం లేని వారు కూడా పురాణాలపై చర్చలు చేస్తారు.
వాళ్లకు ఎన్టీఆర్ నటించిన పాత్రల ద్వారానే రాముడైనా, రావణుడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా, అర్జునుడైనా, భీముడైనా తెలియవచ్చు.
ఇదే కాదు, బృహన్నల పాత్రను నటించేందుకు ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ ప్రయత్నించలేరు.
చేసినా న్యాయం చేయలేరు. అలాగే భీష్ముడి జీవితాన్నంతా ఒకే సినిమాలో పూర్తి న్యాయంగా ప్రదర్శించడమూ ఎవ్వరికీ సాధ్యం కాదు.
ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన విధంగా ఆ పాత్రకు జీవం పోసే నటనా నైపుణ్యం మరెవ్వరిలోనూ లేదు.
వివరాలు
'దానవీరశూరకర్ణ' - ఎన్టీఆర్ సృష్టించిన అద్భుతం
ఎన్టీఆర్ నటజీవితంలో 'దానవీరశూరకర్ణ' ప్రత్యేకమైన స్థానం కలిగిన సినిమా.
ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే అపూర్వమైన చిత్రం.ఇందులో కృష్ణుడు,దుర్యోధనుడు,కర్ణుడు అనే మూడు విభిన్నమైన,వ్యక్తిత్వంలో భిన్నమైన పాత్రలను ఒక్కరే పోషించడం అంటే సహజంగా సాధ్యంకాని విషయం.
ఈ సినిమాకు దర్శకత్వం,నిర్మాణ బాధ్యతలు కూడా స్వయంగా తీసుకోవడం..అది చరిత్రాత్మక ఘట్టం.
25 రీల్లున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కనిపించని సీన్లు మినహా అన్ని సీన్లలో ఆయన కనిపిస్తారు.
ఇందులో ఒకటి కాదు,రెండు కాదు - ఇద్దరు ఎన్టీఆర్లు, ముగ్గురు ఎన్టీఆర్లు కనిపించే సన్నివేశాలే ఎక్కువ.
ఈ చిత్రానికి నాలుగు గంటల ఏడు నిమిషాల నిడివి ఉన్నా - నేటికీ టీవీలో వస్తే ప్రేక్షకులు ఛానల్ మార్చకుండా చూస్తారు అంటే అది ఆయన కళాత్మక ప్రతిభకు నిదర్శనం.