Page Loader
Pahalgam Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు 
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు

Pahalgam Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం - క్షేమంగా బయటపడ్డ నటి దీపికా కాకర్ దంపతులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

మంగళవారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ దాడి సమయంలో కొంతమంది పర్యాటకులు ఎంతో కష్టం మీద ప్రాణాలను అరచేత పట్టుకొని బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్ తన భర్త, నటుడు షోయబ్ ఇబ్రాహీమ్‌తో కలిసి ఇటీవల కశ్మీర్‌కి విహారయాత్రకు వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం నాడు వీరు తమ కశ్మీర్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందమైన కశ్మీరీ ప్రకృతి మధ్య తీయటి క్షణాలను వీరు అభిమానులతో షేర్ చేశారు.

వివరాలు 

కశ్మీర్ నుంచి బయలుదేరి ప్రస్తుతం దిల్లీకి..

అయితే మంగళవారం జరిగిన ఉగ్రదాడి వార్త వెలుగులోకి రావడంతో వీరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీపికా, షోయబ్ దంపతులు ఈ ఘటనలో ఏమైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో పలువురు నెటిజన్లు మెసేజ్‌లు పంపుతూ వారి క్షేమాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా, దీపికా మరియు షోయబ్ ఇబ్రాహీమ్ దిల్లీకి సురక్షితంగా చేరుకున్నారని తెలియజేస్తూ ఓ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "మేం క్షేమంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయలుదేరి ప్రస్తుతం దిల్లీకి సురక్షితంగా వచ్చాం. దయచేసి ఎవరూ ఆందోళన చెందకండి" అని షోయబ్‌ ద్వారా వెల్లడించారు.

వివరాలు 

షోయబ్‌ పోస్ట్‌పై విమర్శలు 

అయితే షోయబ్ పోస్ట్‌పై కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి. దేశమంతా ఈ దాడిపై విషాదంలో మునిగిపోయిన వేళ, తన కశ్మీర్ పర్యటనపై వ్లాగ్ రూపొందిస్తున్నట్లు షోయబ్ ప్రకటించడం కొంతమంది నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ''ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్న సమయంలో కూడా మీ వ్లాగ్ ప్రచారం అవశ్యకమా?'' అంటూ పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, మినీ స్విట్జర్లాండ్‌గా పిలవబడే పహల్గాం సమీపంలోని బైసరన్ ప్రాంతంలో కొండల మధ్య పర్యటిస్తున్న పర్యాటకులపై మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడికి దిగారు. ఈ దాడిలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానుష దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.