Jatadhara: దక్షిణాదిని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి: సోనాక్షి సిన్హా
ఈ వార్తాకథనం ఏంటి
సుధీర్ బాబు ప్రధాన పాత్రధారిగా, వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జటాధర'లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో తొలిసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్న ఆమె, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ పరిశ్రమ గురించి ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు బాలీవుడ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. "నేను ఇంతకుముందు ఒక తమిళ సినిమా ('లింగ')లో నటించాను.ఇప్పుడు ఎన్నాళ్ల తర్వాత 'జటాధర' ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతోంది.నిజానికి,ఇతర ప్రాంతీయ భాషల్లో పనిచేయాలన్న ఆసక్తి నాకు చాలాకాలంగా ఉన్నా,వరుసగా ఉన్న చిత్రీకరణలు,డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమై ఇప్పటివరకు సాధ్యపడలేదు" అని సోనాక్షి తెలిపారు.
వివరాలు
బాలీవుడ్ నిస్సందేహంగా మారాలి: సోనాక్షి
దక్షిణాది చిత్రసీమలో సమయపాలన అద్భుతంగా ఉంటుంది.బాలీవుడ్ తప్పకుండా ఈ విషయంలో మారాలి. ఇక్కడ ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభిస్తే సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా ముగిస్తారు. ఆ సమయానికి తర్వాత ఎటువంటి షూటింగ్ జరగదు.ఇది చాలా మంచి పద్ధతి. ఇలాంటి క్రమశిక్షణ ఉండాలి. కానీ హిందీ ఇండస్ట్రీలో అయితే చాలా సార్లు అర్ధరాత్రి వరకు షూటింగ్ సాగుతుంది.ఈ విషయంలో బాలీవుడ్ నిస్సందేహంగా మారాలి''అని సోనాక్షి అన్నారు. 'జటాధర' చిత్రం తెలుగు,హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.ఇందులో సోనాక్షి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అనంతపద్మనాభ స్వామి ఆలయ రహస్యాల నేపథ్యంతో ఈ కథ సాగుతుందని చెబుతున్నారు. తన కెరీర్లో ఇంతవరకు చేయని ఒక కొత్త తరహా పాత్ర ఇదేనని సోనాక్షి వెల్లడించారు.