
Vikram Sugumaran : ప్రముఖ దర్శకుడు కన్నుమూత..
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం చెన్నైలో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు.
లభించిన సమాచారం ప్రకారం.. మధురై నుండి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.
అప్పటికే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది.ఆయన అకాల మరణం తమిళ చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచింది.
ఈ విషాద వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు తెలియజేశారు.
నటుడు శాంతు దర్శకుడితో ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి,X వేదికగా, "ప్రియమైన సోదరా..నిన్ను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.నిన్ను ప్రతి క్షణం గుర్తుచేసుకుంటూనే ఉంటాను.ఈ ప్రపంచాన్ని ఇంత త్వరగా వదిలి వెళ్ళడం నమ్మశక్యంగా లేదు.మిమ్మల్ని నెమ్మదిగా మిస్ అవుతున్నాను"అంటూ భావోద్వేగంగా స్పందించారు.
వివరాలు
గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం 'మాదా యానై కూటం'
ఇక మరో నటుడు కాయల్ దేవరాజ్ కూడా ఈ వార్తను విన్న వెంటనే షాక్కు గురయ్యారు.
"ఈ వార్తను నేను నిజంగా నమ్మలేకపోతున్నాను"అంటూ విచారం వ్యక్తం చేశారు.
దర్శకుడిగా విక్రమ్ సుగుమారన్కి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం 'మాదా యానై కూటం'. ఆ సినిమా తర్వాత ఆయన పలు విలక్షణమైన సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల అభినందనలు పొందారు.
ప్రస్తుతం 'థెరం పోరం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్న సమయంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
ఇదిలా ఉండగా,ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ,పరిశ్రమలో కొంతమంది తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అలాంటి అనుభవాలే ఆయనపై మానసిక ఒత్తిడిగా మారి, ఈ గుండెపోటుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.