ఇళయరాజా పాటలను రీమిక్స్ చేస్తోన్న టాలీవుడ్, రవితేజ కూడా చేరిపోయాడు
పాత పాటలను రీమిక్స్ చేయడం టాలీవుడ్ లో కొత్తేమీ కాదు, కానీ వరుసగా రీమిక్స్ పాటలు రావడమే చెప్పుకోవాల్సిన విషయం. అది కూడా ఇళయరాజా పాటలే రీమిక్స్ కావడం మరో అంశం. తాజాగా రావణాసుర చిత్రం నుండి సెకండ్ పాటను రిలీజ్ చేసారు. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాను నీ కీర్తినే అంటూ సాగే పాటను వెంకటేష్ నటించిన సూర్య ఐపీఎస్ చిత్రంలో నుండి తీసుకొచ్చారు. ఇళయరాజా స్వరపర్చిన ఈ పాటను, ఈ తరానికి నచ్చే విధంగా బీటూ రూటూ మార్చేసారు. కొత్త బీట్ లో కొంత వేగం పెంచి అనురాగ్ కులకర్ణితో పాడించారు. పాట ఎలా ఉందంటే: వినడానికి పాట బానే ఉంది. పాత దాన్ని చెడగొట్టిన ఫీలింగ్ లేదు.
వరుసగా రీమిక్స్ అవుతోన్న ఇళయరాజా పాటలు
రావణాసుర నుండి రిలీజైన ఈ రీమిక్స్ పాటలో రవితేజ, మేఘా ఆకాష్ డాన్సులు వేసారు. రవితేజ డాన్స్ లో మంచి గ్రేస్ కనిపించింది. మేఘా ఆకాష్ అందంగా ఉంది. అయితే ఈ పాట విన్నాక అందరికీ కలిగిన ఒకే ఒక్క అనుమానం ఏంటంటే, ఈ పాటనే ఎందుకు రీమిక్స్ చేసారు అని. దానికి ఏదైనా కారణం ఉందా అనేది సినిమా చూస్తే తెలుస్తుందేమో! ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇటీవల అమిగోస్ చిత్రంలో.. ఎన్నో రాత్రులొస్తాయి గానీ అనే ఇళయరాజా పాటను రీమిక్స్ చేసారు. ఇప్పుడు రావణాసుర లో వెయ్యిన్నొక్క జిల్లాలోన అనే పాట రీమిక్స్ అయ్యింది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందేమో చూడాలి. ఏప్రిల్ 7వ తేదీన రావణాసుర విడుదలవుతుంది.