Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్తోనే పార్లమెంట్లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు?
పార్లమెంట్లో బుధవారం భద్రతా లోపం కారణంగా ఇద్దరు దుండగులు హల్చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇద్దరు వ్యక్తులు లోక్సభలోని పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్లోకి దూకి.. కలర్ స్ప్రేలు చల్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని పట్టుకున్న భద్రతా సిబ్బంది విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులను సాగర్, మనోరంజన్లుగా గుర్తించారు. నిందితుడు సాగర్ శర్మ వద్ద సందర్శకుల పాస్ లభించింది. ఆ పాస్ జారీ చేసింది బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా కావడంతో చర్చనియాంశంగా మారింది. ఎంపీ సింహా పేరుతో జారీ చేసిన విజిటర్ పాస్ ద్వారానే నిందితుడు సాగర్ పార్లమెంట్ హౌస్లోకి ప్రవేశించాడని భద్రతా వర్గాలు తెలిపాయి.
ప్రతాప్ సింహా ఎవరు?
ప్రతాప్ సింహా కర్ణాటకలోని మైసూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అతను వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. కర్ణాటకలో బీజేపీ యువమోర్చా మాజీ అధ్యక్షుడిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ప్రతాప్ సింహ జర్నలిస్టు కూడా ఉన్నారు. 1999లో ప్రతాప్ సింహా కన్నడ వార్తాపత్రిక విజయ కర్ణాటకలో ట్రైనీగా తన జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ వార్తాపత్రికల్లో పని చేశారు. ప్రతాప్ సింహా కర్ణాటకలోని హిల్ స్టేషన్లలో ఒకటైన సకలేష్పూర్లో జన్మించారు. 2008లో సింహా 'నరేంద్ర మోదీ: ది అన్ట్రాడెన్ రోడ్' అనే మోదీ జీవిత చరిత్రను రాయడం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించారు.
ఈరోజు ఏమి జరిగింది
పార్లమెంట్ హౌస్పై ఉగ్రదాడి దాడి నేటికి (డిసెంబర్ 13) 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజున లోక్సభ కార్యకలాపాలు జరుగుతుండగా.. జీరో అవర్ సమయంలో మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకారు. అనంతరం రంగుల స్ప్రే చేయడం ప్రారంభించారు. ఈ ఘటన సంచలనంగా మారింది. భద్రతా సిబ్బంది, కొందరు ఎంపీలు దుండగులను చుట్టిముట్టి పట్టుకున్నారు. 2001లో పార్లమెంట్పై ఉగ్రదాడి జరిగి 22ఏళ్లు పూర్తైన రోజే.. పార్లమెంట్ భద్రత లోపం మరోసారి బయటపడింది. ఈ ఘటనపై లోక్సభ తన స్థాయిలో విచారణ జరుపుతోందని, ఢిల్లీ పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభలో వ్యాపించిన పొగ సాధారణమైదని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.