LOADING...
Rajasthan: గణతంత్ర దినోత్సవ వేళ.. రాజస్థాన్‌లో 10 వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
గణతంత్ర దినోత్సవ వేళ.. రాజస్థాన్‌లో 10 వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

Rajasthan: గణతంత్ర దినోత్సవ వేళ.. రాజస్థాన్‌లో 10 వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2026
06:54 am

ఈ వార్తాకథనం ఏంటి

గణతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్‌లో భారీ స్థాయిలో అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి. నాగౌర్ జిల్లా హర్సౌర్ గ్రామ పరిధిలోని ఓ పాడుబడ్డ ఫామ్‌హౌస్‌లో నుంచి సుమారు 10,000 కిలోల పేలుడు పదార్థాలను రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు సంబంధించి పనిచేస్తున్న స్మగ్లింగ్ నెట్‌వర్క్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ కేసులో సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా స్పెషల్ టీమ్‌తో పాటు స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ దాడి జరిగింది. థావ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించగా, అక్కడ భారీగా పేలుడు పదార్థాలు దాచినట్టు గుర్తించారు.

వివరాలు 

నాగౌర్ జిల్లాలో పాడుబడ్డ ఫామ్‌హౌస్‌లోని నాలుగు వేర్వేరు గదుల్లో పేలుడు సామగ్రి

దాడుల్లో పోలీసులు 187 సంచుల అమోనియం నైట్రేట్ (సుమారు 9,550 కిలోలు)తో పాటు డెటొనేటర్లు, డెటొనేటర్ వైర్లు, ఇతర పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే తొమ్మిది కార్టన్ల డెటొనేటర్లు, నీలం-ఎరుపు రంగుల వైర్ల కట్టలు,పెద్ద-చిన్న'గుల్లాలు', డూడెట్ మెటీరియల్, చెక్క పెట్టెలు, APSOD పేలుడు పదార్థాల ప్యాకెట్లు కూడా లభ్యమయ్యాయి. ఈ పేలుడు పదార్థాలను గ్రామ అవుట్‌స్కర్ట్స్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌లోని నాలుగు వేర్వేరు గదుల్లో దాచినట్టు పోలీసులు గుర్తించారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకే ఇలా విభజించి నిల్వ చేసినట్టు అధికారులు భావిస్తున్నారు. నాగౌర్ జిల్లా ఎస్పీ మృదుల్ కచ్ఛావా మాట్లాడుతూ, ప్రాథమిక విచారణలోనే నిందితుడు ఈ పేలుడు పదార్థాలను అక్రమ మైనింగ్‌లో పాల్గొనే వారికి సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడని తెలిపారు.

వివరాలు 

సులేమాన్ ఖాన్‌పై మూడు క్రిమినల్ కేసులు  

అక్రమ మార్కెట్‌లో ఈ సరుకు విలువ కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సులేమాన్ ఖాన్‌పై గతంలో మూడు క్రిమినల్ కేసులు నమోదైనట్టు దర్యాప్తులో తేలింది. వాటిలో రెండు కేసులు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉండగా, ఒక కేసులో అతడు నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ ఘటనపై Explosives Act-1884, Explosive Substances Act-1908తో పాటు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి నెట్‌వర్క్‌లతో సంబంధాలు బయటపడితే కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా రంగంలోకి దించనున్నట్టు ఎస్పీ తెలిపారు.

Advertisement

వివరాలు 

పేలుడు పదార్థాల సరఫరా వెనుక ఉన్న లింకులపై పోలీసుల ఆరా 

అక్రమంగా పేలుడు పదార్థాల నిల్వపై అందిన సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసులు చెప్పారు. టెక్నికల్ సర్వైలెన్స్, స్థానిక ఇన్‌పుట్లతో సరుకు తరలింపు, నిల్వపై నిఘా పెట్టి చివరకు పట్టుకున్నామని వెల్లడించారు. పేలుడు పదార్థాల సరఫరా వెనుక ఉన్న లింకులపై పోలీసులు గాలింపు చేపట్టారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి చేరాల్సి ఉంది, పెద్ద స్థాయిలో అక్రమ మైనింగ్‌కేనా లేక ఇతర అక్రమ కార్యకలాపాలకు వినియోగించాలనుకున్నారా అన్న అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేస్తామని, త్వరలోనే మరిన్ని దాడులు చేపట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.

Advertisement