FDI in pension sector: పింఛన్ రంగంలోకి వందశాతం ఎఫ్డీఐలు.. కేంద్రం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
పింఛన్ రంగంలో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. బీమా రంగం తరహాలోనే పింఛన్ రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని 100 శాతానికి పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు అవసరమైన చట్ట సవరణ బిల్లును రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ గత ఏడాది పార్లమెంట్ చట్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పింఛన్ రంగంలో ఎఫ్డీఐ పరిమితి 49 శాతంగా ఉంది. దీనిని 100 శాతానికి పెంచాలంటే PFRDA Act 2013కు సవరణలు చేయాల్సి ఉంటుంది.
వివరాలు
15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు
ఈ బిల్లులో భాగంగా పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (PFRDA) నుంచి జాతీయ పింఛను వ్యవస్థ ట్రస్ట్ (NPS ట్రస్ట్)ను వేరు చేసే ప్రతిపాదనను కూడా చేర్చనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్పీఎస్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అధికారాలు, విధులను ఒక స్వతంత్ర ఛారిటబుల్ ట్రస్ట్ లేదా కంపెనీల చట్టం పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అదేవిధంగా ఎన్పీఎస్ ట్రస్ట్ను పీఎఫ్ఆర్డీఏ నుంచి పూర్తిగా వేరు చేసి, 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల ద్వారా పింఛన్ రంగంలో పెట్టుబడులు పెంచడంతో పాటు వ్యవస్థను మరింత పారదర్శకంగా, స్వతంత్రంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.