LOADING...
Future City: భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో 11 టౌన్‌షిప్‌లు.. 30 వేల ఎకరాల్లో 30 నెలల్లో నిర్మించేందుకు ప్రణాళిక
30 వేల ఎకరాల్లో 30 నెలల్లో నిర్మించేందుకు ప్రణాళిక

Future City: భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో 11 టౌన్‌షిప్‌లు.. 30 వేల ఎకరాల్లో 30 నెలల్లో నిర్మించేందుకు ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో మొత్తం 11 టౌన్‌షిప్‌ల నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా అధికారులకు అందించారు. 30 నెలల్లోనే నిర్మాణాలు పూర్తి కావాలంటూ లక్ష్యాలు నిర్దేశించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రణాళిక రూపొందించే సమయంలో, నైపుణ్య విశ్వవిద్యాలయం,కృత్రిమ మేధ నగరం,ఎలక్ట్రానిక్స్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ వంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరచడమే కాకుండా, ఫార్చ్యూన్‌ 500కంపెనీలలో 70%కి పైగా సంస్థలు ఈ సిటీలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. అందుకే అధికారులు అన్ని టౌన్‌షిప్‌లను ఇలాంటి విధంగా రూపకల్పన చేశారు. నిర్మాణాలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా కూడా పర్యవేక్షణ చేస్తారు.

వివరాలు 

అనుమతుల కోసం ప్రత్యేక కార్యాలయం: 

హైదరాబాద్‌ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, కందుకూరు మండలం, మీర్‌ఖాన్‌పేట్ మరియు ముచ్చర్ల గ్రామాల మధ్య 30,000 ఎకరాల విస్తీర్ణంలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ రూపుదిద్దుకుంటోంది. 11 టౌన్‌షిప్‌ల రూపకల్పన, అనుమతులు, ఇతర అవసరమైన వ్యవహారాలను సులభంగా చూసుకునేందుకు ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేశారు.

వివరాలు 

ఎడ్యుకేషన్ సిటీ: 

నైపుణ్య విశ్వవిద్యాలయం 2024 డిసెంబరు 9న ప్రారంభమయ్యింది. వృత్తి విద్య నేర్చుకునే విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకునే యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల పనులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన టౌన్‌షిప్‌ల నిర్మాణాలు కూడా త్వరలో ప్రారంభం కావనుంది.

Advertisement