రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని నిరసన తెలుపుతున్న భారత్ స్టార్ రెజ్లర్లు తమ పతకాలను పవిత్ర గంగానదిలో వేస్తామడంపై '1983ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు' సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రముఖ వార్త సంస్థ పీటీఐకి ఒక ప్రకటన విడుదల చేశారు. రెజ్లర్లు అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరారు. సమస్యలు తప్పకుండా పరిష్కారమవుతాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశ ఛాంపియన్ రెజ్లర్లు ప్రవర్తించిన తీరు వల్ల చాలా బాధపడ్డామని ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఆ పతకాలు రెజ్లర్ల సొంతం మాత్రమే కాదని, దేశానికి గర్వకారణం: జట్టు సభ్యులు
కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు తాము చాలా ఆందోళనకు గురైనట్లు 1983ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు పేర్కొన్నారు. ఆ పతకాలు సంవత్సరాల తరబడి కృషి, త్యాగం, సంకల్పంతో వచ్చాయని గుర్తు చేశారు. ఆ పతకాలు కేవలం రెజ్లర్ల సొంతం మాత్రమే కాదని, దేశానికి గర్వకారణం అన్నారు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని తాము కోరుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. రెజ్లర్ల మనోవేదనలను కూడా ప్రభుత్వం వినాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నట్లు జట్టు సభ్యులు పేర్కొన్నారు. మే 28న అనుమతి లేకుండా కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై దిల్లీ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో రెజ్లర్లను తమ పతకాలను గంగానదిలో వేయాలని నిర్ణయించుకున్నారు.