Court Judges -Letter-CJI: న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయి: సీజేఐకు రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు లేఖ
న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డ్ సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డివై చంద్రచూడ్(DY Chandra Chud) కు లేఖ రాశారు. రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీలు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ దినేష్ మహేశ్వరీతో పాటు మరికొందరు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసం కొన్నిరాజకీయ శక్తులు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి కోర్టులను ప్రభావితం చేయాలని చూస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారిపోతుందన్నారు.
20 రోజుల్లో రెండవ లేఖ
ఫలితంగా ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండదని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వారు చేస్తున్న నీతిబాహ్యచర్యల వల్ల న్యాయస్థానాల సమగ్రతకు, ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, దీంతో న్యాయవ్యవస్థపైనా, న్యాయమూర్తులపై గౌరవం, నమ్మకాన్ని ప్రజలు కోల్పోతారని అందులో పేర్కొన్నారు. అయితే తమను ప్రభావితం చేస్తున్న ఆ రాజకీయ శక్తులేంటి అన్నది మాత్రం లేఖలో ప్రస్తావించలేదు. కాగా, గత 20 రోజుల్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇటువంటి లేఖ రాయడం ఇది రెండవది కావడం గమనార్హం.