
Char Dham Yatra: చార్ ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజా వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ మేరకు ప్రకటన చేశారు. "చార్ధామ్ యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తివేశాం"అని ఆయన తెలిపారు. అంతేకాక, వాతావరణ పరిస్థితుల ఆధారంగా యాత్రకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు స్వయంగా నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించారు. అవసరమైతే వాహనాల రాకపోకలను నిలిపివేయాలని సూచించారు.గడచిన కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించిన సంగతి విదితమే.
వివరాలు
సోన్ప్రయాగ్-ముంకటియా రహదారి తాత్కాలికంగా మూసివేత
ఇక ఉత్తరాదిన వర్షాలు ఉధృతంగా కురుస్తుండటంతో పలు రాష్ట్రాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి వలన యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్ ప్రాంతంలో ఆదివారం భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన సంభవించింది. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో కేదార్నాథ్ యాత్రకు కీలకమైన రుద్రప్రయాగ్ జిల్లాలోని సోన్ప్రయాగ్-ముంకటియా రహదారిపై కూడా కొండచరియలు విరిగిపడ్డ కారణంగా ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భద్రత పరంగా సోన్ప్రయాగ్, గౌరికుండ్ ప్రాంతాల్లో యాత్రికుల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు.
వివరాలు
నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ప్రముఖ జిల్లాలు అయిన చమోలి, పౌరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్ తో పాటు రాష్ట్రంలోని మరెన్నో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నదులు ప్రమాదకరంగా ఉప్పొంగిపోతుండటంతో, నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని రాష్ట్ర పరిపాలన తాజా హెచ్చరికలు జారీ చేసింది.