Page Loader
సంక్షిప్తం చేయు
star hotels: హైదరాబాద్‌ నగరంలో ఊపందుకుంటున్న ఆతిథ్య రంగం.. రానున్న ఆరేడేళ్లలో 25 వరకు స్టార్‌ హోటళ్లు, రిసార్టులు 
రానున్న ఆరేడేళ్లలో 25 వరకు స్టార్‌ హోటళ్లు, రిసార్టులు

star hotels: హైదరాబాద్‌ నగరంలో ఊపందుకుంటున్న ఆతిథ్య రంగం.. రానున్న ఆరేడేళ్లలో 25 వరకు స్టార్‌ హోటళ్లు, రిసార్టులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలో ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

రాబోయే ఆరు నుంచి ఏడేళ్లలో దాదాపు 25 వరకు స్టార్‌ హోటళ్లు, రిసార్టులు రాబోతున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన హోటల్ బ్రాండ్లు, దేశీయంగా ఆతిథ్య రంగంలో ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలను నగరంలో విస్తరించేందుకు డెవలపర్లతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

ఈ కొత్త హోటల్స్‌లో చాలా భాగం ఐటీ కారిడార్, శంషాబాద్ విమానాశ్రయ మార్గం, జీనోమ్ వ్యాలీ సమీపంలో ఉన్న శామీర్‌పేట వంటి ప్రదేశాల్లో ఏర్పాటవనున్నాయి.

2032 నాటికి ఈ హోటళ్లలో మొత్తం 5,000కు పైగా గదులు వినియోగదారుల కోసం అందుబాటులోకి రానున్నాయి.

వివరాలు 

హైదరాబాద్‌ మైస్‌ హబ్‌గా మారుతోంది 

ఐటీ, ఫార్మాస్యూటికల్ రంగాలకు కేంద్రబిందువుగా నిలిచిన హైదరాబాద్, ఇప్పుడు మైస్‌ (మీటింగ్స్‌, ఇన్సెంటివ్స్‌, కాన్ఫరెన్సులు, ఎగ్జిబిషన్లు) కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది.

ఇటీవల మిస్ వరల్డ్ పోటీలు మూడు వారాల పాటు నగరంలో నిర్వహించారు. ఇందులో వివిధ దేశాల నుండి మోడల్స్, స్పాన్సర్లు, ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు.

అంతకు ముందు జీ-20 సదస్సు, రెండేళ్లకోసారి జరిగే వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్, ప్రతి సంవత్సరం నిర్వహించే బయోఏషియా సదస్సు వంటి అనేక అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది.

వివరాలు 

హైదరాబాద్‌ మైస్‌ హబ్‌గా మారుతోంది 

అంతేకాకుండా, వైద్య పర్యటనల కోసం కూడా విదేశాల నుండి పలువురు నగరానికి వస్తున్నారు.

పెళ్లిళ్ల కోసం డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కేంద్రంగా కూడా హైదరాబాద్ నిలుస్తోంది.

ఇతర రాష్ట్రాల నుండి ఎంతో మంది ఇక్కడి హోటళ్లు, రిసార్ట్లలో తమ వేడుకలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అంతర్జాతీయంగా ఉన్న ఐటీ కంపెనీల సీఈవోలు, క్లయింట్లు హైదరాబాద్‌ శాఖలను తరచుగా సందర్శిస్తున్న నేపథ్యంలో, కొన్ని సందర్భాల్లో స్టార్ హోటళ్లలో ఖాళీ గదులు లేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో భవిష్యత్తు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పలు ప్రముఖ హోటల్ గ్రూపులు తమ విస్తరణకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి.

వివరాలు 

కొవిడ్‌ తర్వాత తిరిగి పరుగులు తీస్తున్న రంగం 

కొవిడ్‌ సమయంలో తీవ్రమైన దెబ్బతిన్న హోటల్‌ రంగం, ఆ తర్వాత వేగంగా కోలుకుంది.

పరిశ్రమ వర్గాల ప్రకారం, ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు కోవిడ్‌ ముందు ఉన్న స్థాయికి సమానంగా ఉందని పేర్కొన్నారు.

2023-24 సంవత్సరానికి హైదరాబాద్‌లో హోటళ్ల ఆక్యుపెన్సీ 75.1 శాతానికి చేరుకుందని తెలిపారు.

రాబోయే కాలంలో ఈ రంగం మరింత బలపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఏ ఏ ప్రదేశాల్లో ఏమి జరుగుతోందంటే… 

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హిల్టన్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌ను 330 గదులతో 2030 నాటికి ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

2029 నాటికి రాడిసన్ కలెక్షన్ పేరుతో 300గదులు ఏర్పాటుకాబోతున్నాయి.

కోకాపేట నియోపొలిస్‌లో ఇంటర్ కాంటినెంటల్ హోటల్ 250 గదులతో,శంకర్‌పల్లిలో వెల్‌కం హోటల్-ఐటీసీ నుంచి 150గదులతో హోటల్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందాయి.

2040 నాటికి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో తాజ్ వివాంటా 225 గదులతో, బుద్వేల్‌లో జెడబ్ల్యూ మారియట్ 330 గదులతో శంషాబాద్‌లో మరో 220గదులతో కూడిన హోటల్స్ కోసం ఒప్పందాలు కుదిరాయి.

అంతేకాదు,తుక్కుగూడ,మొయినాబాద్,శామీర్‌పేట,మోమిన్‌పేట,తుర్కపల్లి,తూప్రాన్ ప్రాంతాల్లో కూడా పలు సంస్థలు డెవలపర్లతో కలిసి స్టార్ హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందాల్లోకి అడుగుపెడుతున్నాయని క్రెడాయ్ వర్గాలు వెల్లడించాయి.

ఇంకా కొన్ని ఒప్పందాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.