Encounter in Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్...29 మంది మావోల హతం
ఛత్తీస్గఢ్ (Chattisgarh) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో భారత భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టు (Maoists)లను మట్టుబెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, సీనియర్ శంకర్ రావు (Shankar Rao)తో సహా 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతి చెందిన మావోయిస్టు శంకర్ రావు తలపై 25 లక్షల రూపాయల నగదు రివార్డు కూడా ఉంది. ఈ భారీ ఎన్ కౌంటర్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభమై రాత్రి వరకూ కాల్పులు కొనసాగాయి. ఛత్తీస్గఢ్ లోని కంకేర్(Kanker District) జిల్లా బినగుండా (Binagunda) గ్రామ సమీపంలోని హపతోల (Hapatola) దండకారణ్యంలో జరిగింది.
సంయుక్తంగా ఆపరేషన్...
బీఎస్ఎఫ్ (Bsf) జవాన్లు, రాష్ట్ర పోలీసులు కలసి పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ను చేపట్టారు. మావోయిస్టు కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన ఒక పోలీసు స్వల్పంగా గాయపడ్డారు. ఈ భారీ ఎన్కౌంటర్ కు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న లక్ష్మణ్ కేవాత్ నేతృత్వం వహించారు. ఈయనకు గతంలో 44 మంది మావోయిస్టులను హతమార్చిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. రాష్ట్రపతి అవార్డుతో పాటు ఆరు ఇతర అవార్డులను అందుకున్నారు. కాగా, ఈ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి(Chief Minister) విష్ణు డియో సాయి (Vishnu Deo sai) స్పందిస్తూ...మావోయిస్టులపై పోరాటంలో రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. భద్రతా బలగాలు, పోలీసులు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ప్రశంసించారు.
బస్తర్ ను మావోయిస్టు రహిత ప్రాంతంగా చేస్తాం: అమిత్ షా
ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని అభినందించారు. మావోయిస్టులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, వారు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం బస్తర్, కంకేర్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఉంది. బస్తర్ లో తొలిదశ పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ..బస్తర్ ను మావోయిస్టు రహిత ప్రాంతంగా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నానన్నారు. కాగా, ఈ ఎన్కౌంటర్కు సంబంధించి వీడియోను భారత బలగాలు విడుదల చేశాయి. దట్టమైన అడవిలో ముందుంతా నిశ్శబ్దం...కొద్దిసేపటికి జవాన్ల అడుగుల చప్పుడు...ఆపై కాల్పుల శబ్ధం దృశ్యాలతో కూడిన ఆ వీడియో ఓ సినిమా దృశ్యాలను తలపించింది.