LOADING...
Op Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో 5 పాకిస్థానీ F-16, JF-17 జెట్‌లు ధ్వంసమయ్యాయి: IAF 
ఆపరేషన్ సిందూర్ సమయంలో 5 పాకిస్థానీ F-16, JF-17 జెట్‌లు ధ్వంసమయ్యాయి: IAF

Op Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో 5 పాకిస్థానీ F-16, JF-17 జెట్‌లు ధ్వంసమయ్యాయి: IAF 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఐఏఎఫ్‌ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని వాయుసేన అధిపతి ఏపీ సింగ్‌ తెలిపారు. శత్రుదేశ స్థావరాలను గురి పెట్టి అత్యంత కచ్చితత్వంతో దాడులు జరిపి విజయవంతంగా ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌తో భారత్‌ సైనిక శక్తి ఏ స్థాయిలో ఉందో అన్ని దేశాలు అర్థం చేసుకున్నాయని ఆయన అన్నారు. ఆపరేషన్‌లో త్రివిధ దళాల సమన్వయం ద్వారా పాకిస్తాన్‌కు చెందిన పది యుద్ధవిమానాలను పూర్తిగా ధ్వంసం చేశామని ఏపీ సింగ్‌ వెల్లడించారు. వాటిలో ఎఫ్‌-16, ఎఫ్‌-17 మోడల్‌ ఫైటర్‌ జెట్లు కూడా ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ చర్య పాకిస్తాన్‌ వైమానిక శక్తికి గట్టి దెబ్బతీసిందని, అది భారత్‌ సైనిక దళాల ఖచ్చితమైన వ్యూహానికి నిదర్శనమని చెప్పారు.

వివరాలు 

300 కి.మీ దూరంలో లక్ష్యాల ఛేదన

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్‌ భూభాగంలో దాదాపు 300 కి.మీ దూరంలో ఉన్న కీలక లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని ఆయన వివరించారు. ఈ దాడులు పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టే స్థాయిలో ప్రభావం చూపాయని సింగ్‌ పేర్కొన్నారు. ఆ సమయానికి కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినందువల్లే ఇంత భారీ విజయాన్ని సాధించగలిగామని ఏపీ సింగ్‌ చెప్పారు. ఆ అనుమతుల వల్ల మన సైన్యం శత్రుదేశానికి చుక్కలు చూపించిందని, ఆ దాడులు భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాయని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ప్రపంచ దేశాలకు సందేశం

భారత వాయుసేనాధిపతి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా భారత్‌ నుండి ఒక విషయం నేర్చుకోవాలని సూచించారు. శత్రుదేశాలతో లేదా పొరుగు దేశాలతో ఘర్షణలు తలెత్తినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యూహాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి అన్న విషయాలను భారత్‌ ఉదాహరణగా చూపిందని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

రక్షణ రంగంలో స్వావలంబన - సుదర్శన చక్ర

భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు భారత్‌ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని సంకల్పించిందని ఏపీ సింగ్‌ వెల్లడించారు. దీనికోసం 'సుదర్శన చక్ర' అనే కీలకమైన రక్షణ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే త్రివిధ దళాలు సంయుక్తంగా పనిచేయడం ప్రారంభించాయని ఆయన వివరించారు.