Kolkata Hotel Fire: వైద్యం కోసం కోల్కతాకు వచ్చి విగతజీవులైన తొమ్మిది మంది.. హోటల్లో భారీ అగ్నిప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి హోటల్లో బస చేసిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి వైద్యం కోసం వచ్చిన పలువురు న్యూమార్కెట్ సమీపంలోని ఓ హోటల్లో దిగారు. రాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా హోటల్లో మంటలు చెలరేగాయి. అప్పటికే మంటలు వేగంగా వ్యాపించి హోటల్ను చుట్టుముట్టడంతో లోపల ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేక చిక్కుకుపోయారు.
వివరాలు
ఏసీలో జరిగిన పేలుడు కారణంగానే మంటలు
ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా.. వారంతా బంగ్లాదేశ్ జాతీయులేనని అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఏసీలో జరిగిన పేలుడు కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఆరుగురికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్లో ఇటీవల మరో హోటల్లోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
బీర్భూమ్ జిల్లా తారాపీఠ్లోని ఓ హోటల్లో మంటలు చెలరేగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
హోటల్ గ్రౌండ్ఫ్లోర్లోని రిసెప్షన్ వద్ద మొదలైన మంటలు క్షణాల్లోనే భవనం మొత్తం వ్యాపించాయి.
ఆ సమయంలో హోటల్ అతిథులు నిద్రలో ఉండటంతో బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు.