దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక
దిల్లీలోని షహబాద్లో తన ప్రియుడి చేతిలో 16ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు కొన్ని రోజుల ముందు బాలిక తన ప్రియుడి సాహిల్ను బొమ్మ పిస్టల్తో భయపెట్టిందనే విషయం బయటకు వచ్చింది. అంతకుముందు బొమ్మ తుపాకీతో బెదిరించడం వల్లే సాహిల్ ఆమెను హత్య చేసి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం రాత్రి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. ఈ క్రమంలో బాలిక శరీరంపై 16 కత్తి పోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో ఉంది.
సాహిల్ను 2రోజుల పాటు పోలీసుల రిమాండ్కు తరలింపు
16ఏళ్ల బాలిక హత్య కేసులో సాహిల్ను రెండు రోజుల పోలీసు రిమాండ్కు పంపారు. తన ప్రియురాలైన 16ఏళ్ల బాలికను సాహిల్ దారుణంగా పలుమార్లు కత్తితో పొడి చంపాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కొ న్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరగడం, ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఇక ముగించాలని బాలిక కోరుకోవడంతోనే సాహిల్ కోపోద్రిక్తుడై ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. బాలిక తన చేతిపై మరో వ్యక్తి పేరును పచ్చబొట్టు వేయించుకుందని, అది నచ్చకే సాహిల్ ఆమెను హత్య చేశాడని మరికొందరు చెబుతున్నారు. తాజాగా బొమ్మ తుపాకీ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు మాత్రం, విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని చెబుతున్నారు.