
Kolkata Rape Case: కోల్కతా లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో కీలక మలుపు.. వైద్య పరీక్షల్లో షాకింగ్ ఫలితాలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ను తీవ్రంగా కుదిపేసిన ఓ పాశవిక ఘటన కోల్కతా లా కాలేజ్ క్యాంపస్లో వెలుగుచూసింది. 24 ఏళ్ల లా విద్యార్థినిపై క్యాంపస్లోనే అత్యాచారం జరిగింది. ఇటీవలే ఆర్జీకే మెడికల్ కాలేజ్లో ఒక పీజీ వైద్యురాలిపై అత్యాచార ఘటన సంచలనం రేపిన నేపథ్యంలో ఈ మళ్లీ మరో అత్యాచార ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలిపై అత్యాచారం చేసిన నిందితుల్లో ప్రధానంగా మనోజిత్ మిశ్రా ఉన్నాడు. అతడు అధికార టీఎంసీ(తృణమూల్ కాంగ్రెస్)విద్యార్థి విభాగానికి చెందిన నాయకుడిగా ఉన్నట్లు సమాచారం. అతనితో పాటు ఈ దారుణానికి పాల్పడిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల ముగ్గురితో పాటు, సంఘటనలో సహకరించిన సెక్యూరిటీ గార్డుని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Details
వైద్య పరీక్షల్లో వెలుగు చూసిన విషయాలు
బాధితురాలికి జూన్ 26 రాత్రి 10 గంటలకు కోల్కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె మెడపై గాయాలు, ఛాతీపై రాపిడి గీతలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. బాహ్య జననేంద్రియాలు, నోటి భాగంలో గాయాలేమీ కనిపించకపోయినా, పూర్తిగా లైంగిక దాడి జరిగిందని నిర్ధారణకు ఫోరెన్సిక్ పరీక్షలు అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు స్వాబ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫలితాల్లో నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.
Details
బాధితురాలి వాంగ్మూలం ప్రకారం
ఆమె చెప్పిన వివరాల ప్రకారం, టీఎంసీ స్టూడెంట్స్ సమావేశం ముగిసిన తర్వాత నిందితులు తనను లక్ష్యంగా ఎంచుకుని చుట్టుముట్టారని తెలిపింది. రాత్రి 7:30 గంటల సమయంలో ముగ్గురు దాడికి పాల్పడి, ప్రధాన నిందితుడు గార్డుల గదిలో బలవంతంగా తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొంది. దయచేసి విడిచి పెట్టండి అని వేడుకున్నా వినలేదని, తనకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా నిర్దాక్షిణ్యంగా దాడిని కొనసాగించారని తెలిపింది. తాను బయటపెడితే కుటుంబాన్ని, బాయ్ఫ్రెండ్ను చంపేస్తామని బెదిరించారని తెలిపింది. ఈ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. అధికార టీఎంసీకి చెందిన వ్యక్తులే నిందితులుగా ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై పూర్తి స్థాయిలో స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పౌరసమాజం డిమాండ్ చేస్తోంది.