TTD: తిరుపతిలో కనులపండువగా గోదా కల్యాణోత్సవం
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతిలో గోదా కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం రాత్రి టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని మైదానంలో జరిగిన ఈ వేడుక కనులపండువగా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు భక్తిరసంలో మునిగి తన్మయత్వం చెందారు. తొలుత శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధురంగా కీర్తనలు ఆలపించి వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు.
Details
ఘనంగా ముగిసిన గోదా కల్యాణోత్సవం
తదుపరి తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ వంటి సంప్రదాయ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనల మధ్య గోదా కల్యాణోత్సవం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం భక్తులను అలరించింది. ఈ కార్యక్రమంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.